క్రిప్టోకరెన్సీతో స్థూల ఆర్థిక వ్యవస్థకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్

ABN , First Publish Date - 2022-02-10T21:48:08+05:30 IST

ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ (మేక్రోఎకానమీ

క్రిప్టోకరెన్సీతో స్థూల ఆర్థిక వ్యవస్థకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్

న్యూఢిల్లీ : ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ (మేక్రోఎకానమీ)కి ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం చెప్పారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందన్నారు. రెండిందాల సవాళ్ళను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ స్వంత రిస్క్‌తోనే ఆ పని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించడం తన కర్తవ్యమని తెలిపారు. 


క్రిప్టోకరెన్సీకి ఎటువంటి ఆధారాలు లేవని పెట్టుబడిదారులు గమనించాలని చెప్పారు. అది కనీసం టులిప్ అయినా కాదన్నారు. 17వ శతాబ్దంలో టులిప్ మానియా నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫైనాన్షియల్ బబుల్‌కు ఉదాహరణగా దీనిని చెప్తూ ఉంటారు. వాస్తవ విలువ కారణంగా కాకుండా స్పెక్యులేటర్ల కారణంగా టులిప్ విలువ పెరుతూ ఉండేది. 


ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించారు. ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీల గురించి మాట్లాడారు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు లేదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా సరే, అవి మన స్థూల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, ఆర్థిక సుస్థిరతకు పెను ముప్పు కలిగిస్తాయి. ఆర్థిక సుస్థిరత, మేక్రోఎకనమిక్ సుస్థిరత సమస్యలను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యానికి విఘాతం కలిగిస్తాయి’’ అని చెప్పారు. 


ఇదిలావుండగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సమర్పించారు. క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. 2023 నుంచి దేశంలో తొలి డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రారంభిస్తుందని చెప్పారు. 


Updated Date - 2022-02-10T21:48:08+05:30 IST