RBI: ఆర్బీఐ కీలక నిర్ణయాలు.. ఇకపై ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలు..

ABN , First Publish Date - 2022-09-30T22:23:24+05:30 IST

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మాల్స్ లేదా దుకాణాల వద్ద ఫేస్-టు-ఫేస్ లావాదేవీలకు సహకారం అందిస్తున్న ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలను(PAs) నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చింది.

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయాలు..  ఇకపై ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలు..

ముంబై: కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. విక్రయాలు లేదా అమ్మకాల వద్ద ఫేస్-టు-ఫేస్ లావాదేవీలకు సహకారం అందిస్తున్న ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలను(PAs) నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలపై ఏవిధమైన పర్యవేక్షణ ఉంటుందో అదే స్థాయిలో ఆఫ్‌లైన్ సంస్థలపై కూడా నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. శుక్రవారం ముగిసిన ఆర్బీఐ ద్రవ్యవిధాన సమీక్షలో కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలు ఒకే రకమైన కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలకూ అవే పర్యవేక్షణ నిబంధనలను వర్తింపజేయనున్నామని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక నిబంధనల ప్రకారం.. ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలు నిర్వహించిన లావాదేవీల డేటా సేకరించి స్టోర్ చేస్తామని తెలిపింది. దీంతో ఒక కస్టమర్‌కి సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను ఆఫ్‌లైన్ పేమెంట్ కంపెనీలు నిల్వ చేసుకోవడానికి వీల్లేదు.


పేమెంట్ల వ్యవస్థలో పేమెంట్ సంస్థలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయని, అందుకే వీటిని మార్చి 2020లో నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చామని, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ (పీఎస్‌వో)లుగా పేర్కొన్నామని శక్తికాంత్ దాస్ ప్రస్తావించారు. అయితే ప్రస్తుత నిబంధనలు కేవలం ఆన్‌లైన్ లేదా ఈ-కామర్స్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తున్నాయని తెలిపారు. ఫేస్‌ టు ఫేస్ లావాదేవీలు నిర్వహించే ఆఫ్‌లైన్ పేమెంట్ సంస్థలను కూడా ప్రస్తుతం నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 


ఆర్‌ఆర్‌బీల్లోనూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం..

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనూ (RRBs) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందించనున్న కస్టమర్ల హేతుబద్ధీకరణ జరుగుతోందని ఆయన తెలిపారు. కాగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రస్తుతం కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం ఉన్నా.. ఆర్బీఐ ముందస్తు అనుమతి ఉన్నవారికి మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించి ఖాతాదారులు కొన్ని ఫైనాన్సియల్, నాన్-ఫైనాన్సియల్ ప్రమాణాలను పాటించాల్సి వస్తోంది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని వెల్లడించారు.

Updated Date - 2022-09-30T22:23:24+05:30 IST