ఆర్బీకేలకు.. అద్దె కష్టాలు
ABN , First Publish Date - 2022-05-19T05:39:57+05:30 IST
రైతులకు అన్ని విధాల భరోసా ఇచ్చేందుకు రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే రైతులకు ఏ స్థాయిలో భరోసా కలుగుతుందో తెలియదు కాని.. అద్దె కష్టాలు మాత్రం తప్పడంలేదు.
అద్దె భవనాల్లో 200కు పైగా కేంద్రాలు
నెలల తరబడి ట్రెజరీల్లో బిల్లుల పెండింగ్
బకాయిలు చెల్లించాలని యజమానుల గగ్గోలు
కొలిక్కిరాని రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలు
బాపట్ల, మే 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు అన్ని విధాల భరోసా ఇచ్చేందుకు రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే రైతులకు ఏ స్థాయిలో భరోసా కలుగుతుందో తెలియదు కాని.. అద్దె కష్టాలు మాత్రం తప్పడంలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో వాటి నిర్వహణ కోసం భవనాలు అద్దెకిచ్చిన యజమానులకు మాత్రం నెలల తరబడి అద్దె భరోసా దక్కడం లేదు. జిల్లా వ్యాప్తంగా 410 రైతుభరోసా కేంద్రాలున్నాయి. అప్పట్లో వాటి ఏర్పాటుకు పెద్దగా సమయం లేదు. దీంతో చాలావరకు అద్దెభవనాల్లోనే ఈ కేంద్రాలను నెలకొల్పారు. దాదాపు 200కు పైగా రైతుభరోసా కేంద్రాలు అద్దె భవనాల్లోనే ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికీ, బిల్లులు చెల్లించడంలో జాప్యం, కరోనా తదితర కారణాలతో వాటి నిర్మాణం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో అద్దె చెల్లించాలని యజమానులు కేంద్రాల నిర్వాహకులను సంప్రదిస్తే బిల్లులు ట్రెజరీలో ఉన్నాయని త్వరలోనే జమ అవుతాయంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దాదాపు ఐదు నెలల నుంచి వారికి ప్రభుత్వం అద్దెలు చెల్లించలేదనేది సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్బీకేలను అద్దె భవనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అద్దెలు కూడా చాలా తక్కువే. ఏదో తమకు చన్నీళ్లకు వేడినీళ్లలా ఉపయోగపడతాయని ప్రభుత్వానికి అద్దెకిస్తే నెలల తరబడి చెల్లించకపోవడం భావ్యం కాదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
15 లక్షల పైనే బకాయిలు..
జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేల అద్దె బకాయిలు దాదాపు 15 లక్షలపై ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ఐదు, నాలుగు నెలలు, మరికొంతమందికి మూడు, రెండునెలలు ఇలా అద్దెలు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు ట్రెజరీకి పంపించామని త్వరలోనే చెల్లింపులు జరుపుతామని ఆర్బీకేల సిబ్బంది చెప్తున్నారు. ఇదే మాట చాలా రోజుల నుంచి చెబుతున్నారని, స్వల్ప మొత్తాలను కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని యజమానులు వాపోతున్నారు.