రైతుల భూములు పరిశీలించిన ఆర్డీవో
ABN , First Publish Date - 2022-07-03T05:37:35+05:30 IST
కందుకూరు డివిజన్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు సాగించిన రైతుల భూములను ఆర్డీవో జి.వి. సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు.
కందుకూరు, జూలై 2: కందుకూరు డివిజన్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు సాగించిన రైతుల భూములను ఆర్డీవో జి.వి. సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. గుడ్లూరు మండలం పోట్లూరు, నాయుడుపాలెం, చిమిడితపాడు, లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లి, కొండాపురం మండలం నేకునాంపేట, కొండాపురం, గానుగపెంట గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసి ధాన్యం విక్రయాలు చేసిన రైతుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల పరిధిలో ఆర్బీకేలలో ధాన్యం విక్రయించిన రైతుల భూములను పరిశీలించారు. రైతులు చూపిన సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో వాస్తవంగా వరి పంట సాగు చేశారా ఇతర పంటలు సాగులో ఉన్నాయా అన్న కోణంలో ఆర్డీవో భూములను పరిశీలించారు.
లింగసముద్రం : కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి శనివారం మండలంలోని అన్నె బోయినపల్లి రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రికార్డులను పరిశీలించారు. రూ.3 లక్షల కంటే ఎక్కువ ధాన్యం అమ్మిన రైతుల గురించి ఆరా తీశారు. పండించిన రైతులే అమ్మారా? లేక ఇతరుల ధాన్యం ఈ కేంద్రం ద్వారా అమ్మారా ఆ రైతులను విచారణ చేశారు. అంతకు ముందు ఆయన పెదపవనింలో ముత్యాలపాడు రెవెన్యూలో భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకొన్న భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్. బ్రహ్మయ్య, వీఎఎ రెడ్డి నాగేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.