కాలం చెల్లిన వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ పెనుభారం!
ABN , First Publish Date - 2022-03-15T07:53:29+05:30 IST
పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖరీదైన వ్యవహా రం కానుంది. ..
ప్రస్తుత చార్జీలకు 8 రెట్లు ఎక్కువ వసూలు
న్యూఢిల్లీ, మార్చి 14: పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖరీదైన వ్యవహా రం కానుంది. ఏప్రిల్ 1 నుంచి రీ-రిజిస్ట్రేషన్కు 8 రెట్ల వరకు ఫీజు వసూలు చేస్తారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల రీ-రిజిస్ట్రేషన్కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి రూ.1,000 వసూలు చేయనున్నారు. కార్లకు రూ.600కు బదులుగా రూ.5,000 వసూలు చేస్తారు. దిగుమతి చేసుకున్న కార్లకు రూ.15,000కు బదులుగా రూ.40,000 వసూలు చేస్తారు. 15 ఏళ్ల రిజిస్ట్రేషన్ గడు వు దాటిన వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. వాణిజ్య వాహనాలకు నెలకు రూ.500 వసూలు చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో మాత్రం 15 ఏళ్లు దాటిన వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ చేయరు. వాటిని ఢిల్లీ రోడ్లపై తిప్పడం, పార్క్ చేయడం నేరమే. 15 ఏళ్లు దాటిన పాత వాణిజ్యవాహనాల ఫిట్నెస్ పరీక్షల చార్జీలు కూడా ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. కార్లకు ప్రస్తుతం రూ.1,000 వసూలు చేస్తున్నారు. దాన్ని రూ.7,000కు పెంచనున్నారు. బస్సులు, ట్రక్కులకు రూ.1500 నుంచి రూ.7,500కు పెంచుతారు. వాణిజ్య వాహనాలకు ఎనిమిదేళ్లు దాటితే ఫిట్నెట్ సర్టిఫికెట్ తప్పనిసరి. రీ-రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ చార్జీల పెంపుతో వాహనాల యజమానులు తమ పాత వాహనాలను తుక్కుకింద తరలించేందుకు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో 1.2 కోట్ల వాహనాలు తక్కు కింద మార్చదగినవి ఉన్నాయి. తుక్కు కింద మార్చేందుకు వాహనాలను ఇవ్వడానికి సిద్ధమయ్యే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.