ముందే చెప్పిన ABN.. మోత్కుపల్లి రాజీనామా వెనుక Etela..
ABN , First Publish Date - 2021-07-23T18:36:09+05:30 IST
మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి..
హైదరాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేయడం వెనుక చాలా విషయాలే ఉన్నాయని తెలుస్తోంది. కమలం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు తాను రాజీనామా చేయడానికి కారణాలేంటో స్పష్టంగా వివరించారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం మోత్కుపల్లికి ఇష్టం లేదని తేల్చిచెప్పేశారు. అసలు ఆయన్ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు..? అని ఈ సందర్భంగా బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
బీజేపీపై ప్రశ్నల వర్షం..
‘ఈటల రాజేందర్ అవినీతిపరుడు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించింది. భూ కబ్జాలు చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు?. ఈటలను చేర్చుకుంటున్నట్లు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నా అనుభవాన్ని బీజేపీ పట్టించుకోలేదు. ఈటల రాజేందర్కు అంత ఆస్తి ఎలా వచ్చింది..?. ఈటలను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలి. ఆయన ఉపఎన్నికలో పోటీ చేసేందుకు అనర్హుడు.దళితబంధుపై సీఎం నిర్వహించిన సమావేశానికి వెళ్తే తప్పేంటి?’ అని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.
ముందే చెప్పిన ఏబీఎన్
కాగా.. సీఎం సమావేశానికి ఆయన వెళ్లడం అనంతరం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించడంతో మోత్కుపల్లి కచ్చితంగా పార్టీ మారతారని ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఏబీఎన్ చెప్పిందే ఇప్పుడు అక్షర సత్యమైంది. కాగా.. త్వరలోనే మోత్కుపల్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరితే ఆయనకు ఏమైనా పదవి ఇస్తారా..? లేదా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలియవచ్చింది.