రేపు టెన్త్, ఎల్లుండి టెట్ ఫలితాలు
ABN , First Publish Date - 2022-06-29T20:34:28+05:30 IST
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం
కొలిక్కి రాని ఇంటర్ కాలేజీల గుర్తింపు
నేడు దోస్త్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.30 గంటలకు ఎంసిహెచ్ఆర్డిలో ప్రకటించనున్నారు. ఫలితాలను www.bse.telangana. gov.in, www.bseresults.telanana.-gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. అలాగే, ఉపాధ్యాయ అరపత పరీక్ష (టెట్) ఫలితాలను జులై 1వ తేదీన విడుదల చేయాలని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును సమీక్షించారు.
సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ దేవేసన, టెట్ కన్వీనర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు అంశం ఇంకా తుది దశకు చేరుకోలేదు. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు కూడా మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా చాలా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్వోసీ సమర్పించాల్సిన కాలేజీలతో పాటు, మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న కాలేజీలకు సంబంధించిన గుర్తింపు అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక, డిగ్రీ సీట్ల భర్తీ కోసం దోస్త్ షెడ్యూల్ను బుధవారం ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించినందున, డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించిన చర్యలను చేపట్టనున్నారు. డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.