రాజ్మాకు రికార్డు ధర
ABN , First Publish Date - 2021-01-22T05:44:47+05:30 IST
రాజ్మాకు ఈ ఏడాది రికార్డుస్థాయి ధర లభించింది. వారపు సంతల్లో కిలో రూ.85 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తున్నారు.
వారపు సంతల్లో కిలో రూ.85లకు కొనుగోళ్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.30 పెరిగిన ధర
చైనా నుంచి దిగుమతి లేకపోవడమే కారణం
పాడేరు, జనవరి 21: రాజ్మాకు ఈ ఏడాది రికార్డుస్థాయి ధర లభించింది. వారపు సంతల్లో కిలో రూ.85 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే కిలోకు రూ.30 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చైనా దేశం నుంచి రాజ్మా దిగుమతి కాకపోవడంతో దేశీయంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఏజెన్సీలో సుమారు 25 వేల ఎకరాల్లో రాజ్మా పంట సాగవుతున్నది. ప్రధానం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 10 వేల ఎకరాల్లో, మిగిలిన మండలాల్లో 15 వేల ఎకరాల్లో రాజ్మాను పండిస్తున్నారు. గత ఐదేళ్లలో కిలో రూ.50-55 మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఎగుమతులు/ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. చైనా నుంచి రాజ్మా గింజల దిగుమతి ఆగిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. వ్యాపారులు సంతలకు వచ్చి, కిలో రూ.85లకు కొనుగోలు చేస్తున్నారు.