అమూల్‌కు రెడ్‌కార్పెట్‌

ABN , First Publish Date - 2020-12-03T06:30:03+05:30 IST

గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ విశాఖ జిల్లాలోనూ అడుగుపెట్టనున్నది. విశాఖ డెయిరీ పురిటిగడ్డ అయిన విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాలకు ‘అమూల్‌’ ఇప్పట్లో రాబోదని తొలుత ప్రచారం జరిగింది.

అమూల్‌కు రెడ్‌కార్పెట్‌

పాల సేకరణ కేంద్రాలకు భూమి కేటాయింపు

ఉపాధి హామీ పథకం కింద భవనాల నిర్మాణం


విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ విశాఖ జిల్లాలోనూ అడుగుపెట్టనున్నది. విశాఖ డెయిరీ పురిటిగడ్డ అయిన విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాలకు ‘అమూల్‌’ ఇప్పట్లో రాబోదని తొలుత ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా జిల్లాలో తొలిదశలో 590 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ‘అమూల్‌’ నిర్ణయించింది. ఇంకా 190 బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నది. అమూల్‌ ప్రతిపాదనల మేరకు ప్రతి పాల సేకరణ కేంద్రానికి ఐదు సెంట్లు భూమి కేటాయించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పాల సేకరణ కేంద్రాలకు భవనాలు నిర్మించనున్నట్టు జేసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అలాగే చేయూత, ఆసరా పథకం నుంచి మహిళలకు పాడి పశువులు పంపిణీ చేస్తామన్నారు.  


జిల్లాలో విశాఖ డెయిరీదే అగ్రస్థానం

పాల సేకరణలో జిల్లాలో విశాఖ డెయిరీదే అగ్రస్థానం. విశాఖ డెయిరీ 1,300 కేంద్రాల ద్వారా సుమారు లక్ష మంది రైతుల నుంచి రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. కాగా హెరిటేజ్‌ డెయిరీ రోజుకు 60 నుంచి 70 వేల లీటర్లు, తిరుమలతోపాటు మరికొన్ని డెయిరీలు మరో 70 నుంచి 80 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. 

Updated Date - 2020-12-03T06:30:03+05:30 IST