‘మూసీ’కి తగ్గిన ఇన్ఫ్లో.. క్రస్ట్గేట్ల మూసివేత
ABN , First Publish Date - 2022-07-02T06:31:51+05:30 IST
నల్లగొండ జిల్లా కేతేపల్లి పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద రాకపోవటం తో క్రస్ట్గేట్లను మూసివేశారు.
‘పులిచింతల’కు 2,900 క్యూసెక్కుల వరద
నల్లగొండ, జూలై 1: నల్లగొండ జిల్లా కేతేపల్లి పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద రాకపోవటం తో క్రస్ట్గేట్లను మూసివేశారు. ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నాలుగు రోజులుగా వరద నీటితో పొంగిపొర్లిన మూసీ ప్రాజెక్టు ప్రశాంతతను సంతరించుకుంది. నాలుగు రోజులుగా ప్రాజెక్టు ఐ దు క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, గురువారం అర్ధరాత్రి వాటిని మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46టీఎంసీ) కాగా, ప్రస్తుతం 638 అడుగులు(2.80టీఎంసీ)గా నమోదైంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు పవర్ హౌస్లోని ఒక యూనిట్ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తూ గంటకు 20మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 164.30అడుగులుగా (30.74టీఎంసీలు) నమోదైంది.
571.90 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 571.90 అడుగులుగా (171.8788 టీఎంసీలు) నమోదైంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 7,528 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,500 క్యూసెక్కులు మొత్తంగా సాగర్ నుంచి 9,02 8 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ఎలాంటి నీటి రాక లేదు. ఎడమ కాల్వ, వరద కాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటిని విడుదల చేయటం లేదు.