ఏపీలో ఉద్యోగులకు తగ్గనున్న జీతాలు
ABN , First Publish Date - 2022-01-08T02:32:49+05:30 IST
ఏపీలో ఉద్యోగులకు జీతాలు తగ్గనున్నాయి. ఐఆర్ 27 శాతం, ఫిట్మెంట్ 23 శాతం ఉండడంతో 4 శాతం జీతాలు తగ్గనున్నాయి.
అమరావతి: ఏపీలో ఉద్యోగులకు జీతాలు తగ్గనున్నాయి. ఐఆర్ 27 శాతం, ఫిట్మెంట్ 23 శాతం ఉండడంతో 4 శాతం జీతాలు తగ్గనున్నాయి. తగ్గిన ఫిట్మెంట్ ప్రభావంతో డీఏలు.. హెచ్ఆర్ఏల్లో కూడా కోత పడుతుందని ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. అయితే ఫిట్మెంట్ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వానికి డబ్బు మిగులుతుందే తప్ప తమకు ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఫిట్మెంట్తో పాటు రిటైర్మెంట్ వయసు పెంపును ఏపీటీఎఫ్ అధ్యక్షుడు భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ వ్యతిరేకించారు. ప్రభుత్వం మెరుగైన ప్రతిపాదనలతో ముందుకురాకపోతే కార్యాచరణ రూపొందిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ద్వజమెత్తుతున్నారు. పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతంగానే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 27 శాతం ఐఆర్ తీసుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ఏపీ ఉద్యోగులు ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ తీసుకోనున్నారు. అయితే 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది.