1నుంచి ‘గ్రాడ్యుయేట్, టీచర్’ ఓటర్ల నమోదు
ABN , First Publish Date - 2022-09-30T07:28:50+05:30 IST
గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదుకు శనివారం నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
తిరుచానూరు, సెప్టెంబరు 29: గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదుకు శనివారం నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకే్షకుమార్ మీనా అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు తిరుపతి కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఓటర్ల జాబితా మొత్తం రద్దు చేశారని చెప్పారు. తప్పనిసరిగా వీరంతా ఓటరుగా నమోదు చేసుకోవాని సూచించారు. జిల్లాలో 2023 మార్చి 29నాటికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీలు కానున్నాయని తెలిపారు. ఇక ప్రత్యేక డ్రైవ్తో ఇప్పటివరకు ఓటుకు ఆధార్ అనుసంధానం 56.44 శాతం చేపట్టామన్నారు. ఈ ప్రక్రియలో సచివాలయ వలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వాములను చేయకూడదని ఆదేశించారు. జేసీ బాలాజి, డీఆర్వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.