రాళ్లపాడు నుంచి సాగు నీరు విడుదల
ABN , First Publish Date - 2021-11-27T06:37:16+05:30 IST
రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఏఈ చంద్రమౌళి, సిబ్బంది ముందుగా జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు.
లింగసముద్రం, నవంబరు 26 : రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఏఈ చంద్రమౌళి, సిబ్బంది ముందుగా జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ ఎస్ఈ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు ఏఈ పేర్కొన్నారు. ఈ నెల 22న రాళ్లపాడు అతిథి గృహంలో రైతులతో సమావేశం నిర్వహించామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాల ప్రకారం 2.50 టీఎంసీల నీరు అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు నీటిని అదనంగా సోమశిల నుంచి కోటా నీరు రావాల్సి ఉండగా, అక్కడి అధికారులతో చర్చించినట్లు ఏఈ తెలిపారు. సోమశిల సీఈ, ఎస్ఈలు 2022 మార్చి నెలాఖరు వరకు రాళ్లపాడు నీరొచ్చే ఉత్తర కాలువ ద్వారా విడుదల చేసేందుకు అంగీకరించారన్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసినట్లు తెలిపారు. కుడి కాలువకు 70 కూసెక్కులు, ఎడమ కాలువకు 10 కూసెక్కుల నీటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విడుదల చేసినట్టు ఏఈ చంద్రమౌళి చెప్పారు.
నార్లు పోసుకునేందుకు అవకాశం
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో వరినార్లు పోయాలా..? వద్దా..? అన్నది రైతులకు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. విడతల వారీగా సాగునీరిస్తామన్నారు. అయితే ఎస్ఈ విడుదల చేసిన సర్కిలర్లో ‘ఆరుతడి పంటలకు నీరిస్తాం’ అని పేర్కొన్నారు. దీనిపై ఈఈ శరత్కుమార్రెడ్డిని వివరణ కోరగా వరిసాగు చేయడానికే పలు విడతలుగా వారబంధీ ప్రాతిపదికన నీరు విడుదల చేస్తామన్నారు. రైతులతో చర్చించి ఎప్పుడెప్పుడు నీరు అవసరమో తెలిసుకొని వారి అవసరాల మేరకు నీరిస్తామని స్పష్టం చేశారు.