మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-01-22T05:54:13+05:30 IST
మతసామరస్యాన్ని కాపాడేందుకు కుల, మతాలకు అతీతంగా అందరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అద్నాన నయీమ్ అస్మీ పేర్కొన్నారు.
- ఎస్పీ అద్నాన నయీమ్ అస్మీ
- సామర్లకోటలో గ్రామ వార్డు సంరక్షణ కమిటీలు ప్రారంభం
సామర్లకోట, జనవరి 21: మతసామరస్యాన్ని కాపాడేందుకు కుల, మతాలకు అతీతంగా అందరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అద్నాన నయీమ్ అస్మీ పేర్కొన్నారు. పెద్దాపురం సర్కిల్ పరిధిలో గ్రామవార్డు సంరక్షణ సేవలు అందించేందుకు 652మంది సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీలను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాలులో పెద్దాపురం డీఎస్పీ అరిటాకులు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అనుమానితుల సమాచారం అందించేందుకు గ్రామ వార్డు రక్షణ కమిటీలు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. దేవాలయాలు, చర్చిలు మసీదులు కమిటీలతో చర్చించి అనుమానితు లను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మతపెద్దలతో తరచూ సమావేశాలు నిర్వహించి నేర సంఘటనలు నిరోధించేందుకు సహక రించాలన్నారు. అసత్య ప్రచారాలను ఫార్వర్డ్ చేయకుండా ఉండేందుకు సోషల్ మీడియా సహకరించాలన్నారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, తహశీల్దార్లు వజ్రపు జితేంద్ర, బూసి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు మాచగిరి ఏసుబాబు, సురేంద్ర, సీఐ విజయబాబు, ఎస్ఐలు సుమంత్, లక్ష్మి ప్రసంగించారు. సమావేశంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ మహిళా పోలీసులు, అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు.