రెమ్డెసివిర్ 30 వేలు
ABN , First Publish Date - 2021-04-23T10:49:23+05:30 IST
రెమ్డెసివిర్, కొవిడ్ వాక్సిన్, కొరతను సొమ్ము చేసుకునేందుకు మెడికల్ షాపులు, ప్రైవేటు ఆస్పత్రులు దందా మొదలుపెట్టాయి.
కొవాగ్జిన్ టీకా బ్లాక్లో 2 వేలు.. రాష్ట్రంలో వ్యాక్సిన్, మెడిసిన్ దందా
గుంటూరు, పాలకొల్లు/మదనపల్లె టౌన్, ఏప్రిల్ 22: రెమ్డెసివిర్, కొవిడ్ వాక్సిన్, కొరతను సొమ్ము చేసుకునేందుకు మెడికల్ షాపులు, ప్రైవేటు ఆస్పత్రులు దందా మొదలుపెట్టాయి. దీంతో రూ.3,200 విలువ చేసే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఒక్కోడోసు రూ.30వేలకు పైనే పలుకుతోంది. అదీ ఉన్నత స్థాయి వారికి మాత్రమే లభ్యమవుతోంది. గుంటూరులోని నాజ్ సెంటర్లోని ఒక షాపు కేంద్రంగా రెమ్డెసివిర్ను మూడు రోజుల పాటు రూ.15-25 వేల వరకు విక్రయించారు. గురువారం వారు కూడా చేతులెత్తేయడంతో డొంకరోడ్డులోని ఓ షాపులో రూ.30 వేలకు అమ్మారు. జిల్లాలో ఓ ఉన్నతాధికారి సైతం తన భార్యకు అవసరం కావడంతో రూ.30వేలకు కొనుగోలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గతంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొని, సీజ్చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రికే ఇపుడు కొవాగ్జిన్ టీకా వేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఒక డోసు ధర రూ.250గా నిర్ణయించగా.. ఈ ఆస్పత్రిలో వెయ్యి నుంచి 2వేల వరకు వసూలు చేస్తున్నారు. మొదటి డోసు సక్రమంగానే వేసినా.. రెండో డోసు సమయానికి బ్లాక్ మార్కెట్ మొదలుపెట్టారు. పట్టణంలో 4వ వార్డుకు చెందిన మహిళ గురువారం రెండో డోసు కోసం వెళ్లగా వారు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో తనకు రెండో డోసు ఇవ్వకుంటే శుక్రవారం ఆస్పత్రి వద్ద నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు.