చెట్లను తొలగించి మట్టి స్వాహా
ABN , First Publish Date - 2021-06-20T05:21:04+05:30 IST
మండలంలోని పోలేపల్లి సమీపంలో గల రంగనాయకుల చెరువు మొర్రం మట్టిని అక్రమార్కులు తోడేస్తున్నారు.
జడ్చర్ల, జూన్ 19: మండలంలోని పోలేపల్లి సమీపంలో గల రంగనాయకుల చెరువు మొర్రం మట్టిని అక్రమార్కులు తోడేస్తున్నారు. 15 ఏళ్ల కిందట క్రితం అటవీశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 10 వేల మొక్కలను విడతల వారీగా చెరువు కట్టతో పాటు ప్రాంగణంలో నాటారు. ఇటీవల కాలంలో ఒండ్రుమట్టి, మొరం మట్టికి డిమాండ్ పెరగడంతో ఆ ప్రాంతంపై అక్రమార్కుల కన్ను పడింది. ఒకప్పుడు చెరువులో ఒండ్రుమట్టిని తరలిస్తున్న సందర్భంలో అడ్డుకున్న నాయకులే, నేడు అక్రమార్కులకు పత్తాసు పలుకుతున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 10 వేల చెట్లను ఎక్స్కవేటర్లు, డోజర్లతో తొలగించి, మట్టిని స్వాహా చేశారని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు విచారణకు వస్తున్నారన్న సమాచారంతో అక్రమార్కులు ఎక్స్కవేటర్లు, డోజర్లు, టిప్పర్లను చెరువు ప్రాంగణం నుంచి తీసుకెళ్లారు.