అద్దె ఉన్నట్టా.. లేనట్టా!

ABN , First Publish Date - 2021-05-07T05:42:51+05:30 IST

కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన ఆనందభారతి గ్రౌండ్‌లో ఏప్రిల్‌లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు.

అద్దె ఉన్నట్టా.. లేనట్టా!

  • ఆనంద భారతి గ్రౌండ్‌లో ఎగ్జిబిషనకు ఏర్పాట్లు
  • ముందస్తుగా రూ.5.31 లక్షల చెల్లింపు 
  • కొవిడ్‌ నేపథ్యంలో అనుమతి నిరాకరణ

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 6: కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన ఆనందభారతి గ్రౌండ్‌లో ఏప్రిల్‌లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఏప్రిల్‌ 10 నుంచి మే 24 వరకు 45 రోజులకు నిర్వాహకులు మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాకుం డానే ఏప్రిల్‌ 1 నుంచి సామగ్రిని ఆనందభారతి గ్రౌండ్‌లో డంప్‌ చేసి పనులు ప్రారంభించారు. రోజుకు రూ.10 వేలు చొప్పున 45 రోజులకు గాను రూ.4.50 లక్షలు, జీఎస్‌టీ రూ.81 వేలు... మొత్తం రూ 5.31 లక్షలు చెల్లించారు. తీరా చూస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా మారడంతో ఎగ్జిబిషన్‌కి అధికారులు అనుమతులు నిరాకరించారు. నెల రోజుల తర్వాత చూద్దామన్నారని సమాచారం. అయితే ఎగ్జిబిషన్‌ పర్మిషన్‌ పెట్టంది 45 రోజులకు కాగా ప్రారంభించకుండానే 26 రోజులు గడిచిపోయాయి. దీంతో ఈ 26 రోజులకు ఎగ్జిబిషన్‌కు అద్దె చెల్లింపులు ఉన్నట్లా.. లేనట్టా.. అనేది స్థానికులలో చర్చకు దారి తీసింది. గతేడాది కరోనా పరిస్థితుల్లో ఆర్టీసీ వద్ద గల రైతు బజార్‌ను ఆనంద భారతి గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా రైతు బజార్‌ను ఆనంద భారతి గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలను కున్నా ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లతో ఉండడంతో శ్రీనగర్‌ గరల్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు తరలించారు. దీంతో రైతుబజార్‌ అందుబాటులో లేకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-07T05:42:51+05:30 IST