డీఈవోకు వినతి పత్రం
ABN , First Publish Date - 2021-05-07T06:05:58+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడి పదుల సంఖ్యలో మరణిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా సానుభూతి చూడపడం లేదని ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గోకారి విమర్శించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 6: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడి పదుల సంఖ్యలో మరణిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా సానుభూతి చూడపడం లేదని ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గోకారి విమర్శించారు. గురువారం ఐజీఎం హై స్కూల్లో డీఈవోను కలిసి ఎస్టీయూ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరితో మార్చి, ఏప్రిల్ నెలల్లో పాఠశాలలు నిర్వహించడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా 150 మందికి పైగా ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడి మరణించారని అన్నారు. జిల్లాలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారని, అయినా ఈ సమస్య తీవ్రతను పట్టించుకోకుండా ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహించాలని, జేవీకే కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించడం జిల్లా విద్యాశాఖ అధికారికి తగదని అన్నారు. ప్రాణాలకంటే కిట్ల పంపిణీనే ముఖ్యమా అని వారు ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు వెకేషన్ డిపార్టుమెంట్ కిందకు వస్తారని, వేసవి సెలవులు ఇచ్చినట్లే ఇచ్చి ఆన్లైన్ శిక్షణకు హాజరు కావాలని, కొవిడ్-19 డ్యూటీ చేయాలని, జేవీకే కిట్లు పంపిణీ చేయాలని అధికారులు చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు తక్షణమే కొవిడ్ టీకా వేయాలని, వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఇంటర్, పది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.