‘రిటైల్’ పై కొవిడ్ పంజా
ABN , First Publish Date - 2021-05-11T05:48:29+05:30 IST
కొవిడ్తో రిటైల్ వ్యాపారం కుదేలవుతోంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రిటైల్ మాల్స్ ఓనర్ల ఆదాయాలకు భారీగా గండి పడింది...
- మాల్స్ ఓనర్ల ఆదాయాలకు భారీ గండి
న్యూఢిల్లీ: కొవిడ్తో రిటైల్ వ్యాపారం కుదేలవుతోంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రిటైల్ మాల్స్ ఓనర్ల ఆదాయాలకు భారీగా గండి పడింది. ఇది ఎంత లేదన్నా 50 శాతం వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవపర్లు, కన్సల్టెంట్ల అంచనా. కరోనా ఉధృతితో గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మాల్స్ అన్నీ మూతపడ్డాయి. మిగతా తొమ్మిది నెలలు పలు ఆంక్షల మధ్య తెరుచుకున్నా ఆదాయాలు అంతంతే. దీంతో చాలా మంది డెవలపర్లు మాల్స్ రెంటల్స్ 25 శాతం వరకు తగ్గించారు. బాగా బిజీగా ఉండే సెంటర్లలోని మాల్స్ అద్దెలు కూడా నాలుగైదు శాతం దిద్దుబాటుకు లోనయ్యాయి.
డిస్కౌంట్లు: లాక్డౌన్లతో దాదాపు గత ఏడాది దాదాపు ఆరు నెలలు మాల్స్ మూతపడ్డాయి. ఈ కాలానికి మాల్స్కు పైసా ఆదాయం లేదు. దీన్ని గమనించి మాల్స్ యజమానులు ఉదారంగా వ్యవహరించారు. మూడు నెలల అద్దెలు పూర్తిగా రద్దు చేశారు. మిగతా తొమ్మిది నెలల రెంటల్స్లోనూ భారీ డిస్కౌంట్లు ఇచ్చారు. దీంతో వారి రెంటల్ ఆదాయం సగటున 50 శాతం వరకు పడిపోయింది. కొవిడ్ రెండో ఉధృతితోనూ ఇదే ప్రమాదం పొంచి ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మల్టీ ప్లెక్స్లు పరిస్థితి మరింత ఘోరం: కొవిడ్ లాక్డౌన్లతో మల్టీప్లెక్స్లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆపరేటర్లకు దమ్మిడీ ఆదాయం లేకుండా పోయింది. గత ఏడాది నవంబరు నుంచి తెరుచుకున్నా మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూసేందుకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయింది. కొవిడ్ రెండో ఉధృతితో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో మల్టీప్లెక్స్లు పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.