Rajeev హత్యకేసు ముద్దాయిలు విడుదలైనా శాపం నుంచి తప్పించుకోలేరు!
ABN , First Publish Date - 2022-05-20T14:55:38+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ముద్దాయిలను న్యాయస్థానం విడుదల చేసినా హత్యకు గురైన రాజీవ్ సహా 16 మంది ఆత్మలు క్షమించవని, వాటి శాపం నుం
- విశ్రాంత సీఐ అనసూయ
పెరంబూర్(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ముద్దాయిలను న్యాయస్థానం విడుదల చేసినా హత్యకు గురైన రాజీవ్ సహా 16 మంది ఆత్మలు క్షమించవని, వాటి శాపం నుంచి తప్పించుకోలేరని విశ్రాంత సీఐ అనసూయ అన్నారు. రాజీవ్ హత్యకు గురైన సమయంలో శ్రీ పెరుంబుదూర్లో భద్రతా విధుల్లో పాల్గొని బాంబు పేలుడు ఘటనలో తృటిలో తప్పించుకున్న ఇన్స్పెక్టర్ అనసూయ ప్రస్తుతం ఉద్యోగ విమరణ పొందారు. రాజీవ్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ను సుప్రీంకోర్టు విడుదల చేయడంపై ఆమె స్పందించారు. రాజీవ్ హత్యకేసును సీబీఐ విచారించగా, పూందమల్లి కోర్టులో విచారణ జరిగిందన్నారు. విచారణలో, పలువురు నిందితులుగా సాక్ష్యాలు నిరూపితమయ్యాయన్నారు. ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీలు పిటిషన్ విచారించిన హైకోర్టు కూడా నిందితులుగా ప్రకటించిందన్నారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా పేరరివాలన్ సహా ఏడుగురు దోషులని ప్రకటించి ఉరిశిక్ష విధించిందని, తర్వాత క్షమాభిక్ష ప్రాతిపదికన యావజ్జీవశిక్షగా తగ్గించిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకున్న నేపథ్యంలో, పేరరివాలన్ను విడుదల చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు. యావజ్జీవం అంటే ఆయుష్షు తీరే వరకు జైలు ఉండాలని అని అన్నారు. అలాకాకుండా, మానవతా దృక్పథంతో, రాజీవ్ సహా 16 మందిని హత్య చేసిన సంఘటనలో ముద్దాయి పేరరివాలన్ను విడుదల చేయడంపై న్యాయస్థానం తీర్పును ఎలా విశ్లేషించాలో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం పేరరివాలన్, ఆ తర్వాత ఈ కేసులోని మిగిలిన ఆరుగురు కూడా విడుదలవుతారని అన్నారు. కోర్టు తీర్పులతో వారు వెలుపలికి వచ్చినా, రాజీవ్, 16 మంది ఆత్మల శాపం నుంచి తప్పించుకోలేరని అనసూయ తెలిపారు.