బాలిక Gang Rape ఘటనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-06-15T21:49:43+05:30 IST
బాలిక గ్యాంగ్రేప్ (Gang Rape) ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బాలిక గ్యాంగ్రేప్ (Gang Rape) ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో జూబ్లీహిల్స్ దేవాలయం దగ్గరే ఘటన జరిగిందని, అయితే ఘటన ఎక్కడ జరిగిందో హైదరాబాద్ సీపీ ఆనంద్ ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. దేవుడి పేరుతో రాజకీయ లబ్ధి పొందే పార్టీ.. ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు. ఒప్పందంతోనే ఎమ్మెల్యే రఘునందన్రావు వీడియో బయటపెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనపై 8 మందిలో ఆరుగురిపైనే కేసులు పెట్టారని తెలిపారు. మిగతా ఇద్దరు ఏమయ్యారు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై పట్టుకోసం డ్రగ్ ఇన్వెస్టిగేషన్ చేశారని, యువరాజుకు పట్టు వచ్చాకా డ్రగ్స్ కేసు నీరుగార్చారని రేవంత్రెడ్డి విమర్శించారు.
‘‘గ్యాంగ్రేప్ కేసులో నేరస్తులకు శిక్షపడేలా సీఎం కేసీఆర్ వ్యవహరించాలి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పింది. కేసీఆర్ తొత్తులకే పదవులిస్తున్నారు. కేసీఆర్ చెప్పుచేతల్లో ఉండేవారికే పోస్టింగ్లు ఇస్తున్నారు. నచ్చినోళ్లకు నజరానా, నచ్చనోళ్లకు జురుమానా వేస్తున్నారు. నలుగురు ఐపీఎస్ల చేతుల్లోనే 15 శాఖలున్నాయి. కేసీఆర్కు ఫేవర్ చేయడానికే వీళ్లంతా పనిచేస్తున్నారు. సమర్థవంతమైన అధికారులను పక్కనపెట్టడం దారుణం’’ అని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
విదేశీయుడైన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె(16) ఉన్నారు. అతడి కుమార్తె ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే గత నెల 28న ఇంటి పక్కన ఉన్న హాదీ అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపు మేరకు ఆ బాలిక.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పబ్లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది. అదే పార్టీలో పాల్గొన్న ఐదుగురు కుర్రాళ్లు.. ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం ఆరా తీయగా జరిగిన ఘోరం బయటపడింది. దీంతో ఆ బాలిక తండ్రి.. ఐదుగురు కుర్రాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వక్ఫ్బోర్డు చైర్మన్ కుమారుడితోపాటు మరికొందరు రాజకీయ ప్రముఖుల పిల్లలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ ప్రముఖల పిల్లలు ఉండటంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.