Revanth: తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-10-05T20:54:41+05:30 IST
తెలంగాణ (Telangana) అస్థిత్వాన్ని సీఎం కేసీఆర్ (KCR) చంపేశారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) అస్థిత్వాన్ని సీఎం కేసీఆర్ (KCR) చంపేశారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతమయ్యారని గుర్తు చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికే బీఆర్ఎస్ (BRS)ను ఏర్పాటు చేశారని తప్పుబట్టారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ చంపేశారని, తెలంగాణ అనే పదం వినిపించకుండా ఆయన కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ను స్థాపించారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని రేవంత్రెడ్డి హెచ్చరించారు.
ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలని హితవుపలికారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారని విమర్శించారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్రెడ్డి తెలిపారు.