మూడోసారి మోదీని ప్రధానిగా చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..: రేవంత్

ABN , First Publish Date - 2022-02-21T20:36:33+05:30 IST

మోదీని మూడోసారి ప్రధానిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

మూడోసారి మోదీని ప్రధానిగా చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..: రేవంత్

హైదరాబాద్: యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపర్చి ఈ దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీని బలహీనం చేయాలంటే... ఇండియాలో ఉన్నవాళ్లను చీల్చాలని, కాంగ్రెస్‌ను బలహీనం చేయాలంటే... యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చాలన్నారు. సీఎం కేసీఆర్ యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేక ఎన్డీయేలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.


కేసీఆర్‌కు నిజంగా మోదీని ఓడించాలనే ఉంటే.. యూపీలో సభలు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇంకా నాలుగు విడతల ఎన్నికలు ఉన్నాయని, మోదీ, యోగీని ఓడించడానికి విడతకొక బహిరంగ సభలు పెట్టాలన్నారు. మోదీని గెలిపించాలని యూపీ ప్రజలకు చెబుతారని... ఇక్కడేమో మోదీని ఓడిస్తానని చెబుతారని... ఈ రెండింటికి అసలు సారూప్యత ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-02-21T20:36:33+05:30 IST