Revanth Reddy: కేసీఆర్ నల్గొండకు తీరని నష్టం చేశారు..

ABN , First Publish Date - 2022-08-30T20:39:24+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రౌండ్‌లోకి వెళ్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Revanth Reddy: కేసీఆర్ నల్గొండకు తీరని నష్టం చేశారు..

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By Election) కోసం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రౌండ్‌లోకి వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP), టీఎర్ఎస్ (TRS) ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం బీజేపీ, టీఎర్ఎస్.. పార్టీ ఫిరాయింపుల కమిటీలను నియమించుకున్నాయని, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి (Rajagopalreddy) రాజీనామాతో నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) నల్లగొండ (Nalgonda)కు తీరని నష్టం చేశారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి గ్రామగ్రామానికి మండల ఇన్‌చార్జ్‌లను నియమిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ కార్యక్రమాలు.. పార్టీ కార్యక్రమాలుగా మారాయని రేవంత్‌ విమర్శించారు.

 

గాల్వన్ లోయలో చనిపోయిన సైనికులకు పరిహారం ఇస్తానని సీఎం కేసీఆర్ బయల్దేరారని, మరి తెలంగాణ నుంచి మరణించిన సైనికుల కుటుంబాలకు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అంటే భూ దోపిడీ, అవినీతి చేయడమా? అని నిలదీశారు. ఆస్తుల విధ్వంసం చేయడమే గుజరాత్ మోడల్ అని విమర్శించారు. తెలంగాణను ఆక్రమించడానికి ప్రధాని మోదీ.. దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారన్నారు. గులాంనబీ ఆజాద్ ఇప్పుడు మోదీకి గులాంగా మారారని ఎద్దేవా చేశారు. రాజ్యసభ రెన్యువల్ కాలేదని పార్టీని దూషిస్తే ఎవరూ క్షమించరని రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-08-30T20:39:24+05:30 IST