Revanth vs Rajagopal.. రాజగోపాల్రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-08-05T17:54:29+05:30 IST
రాజగోపాల్రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఢిల్లీ (Delhi): కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy)తో బహిరంగ చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చకు రెడీ అన్నారు. రాజగోపాల్రెడ్డి ఎలా ఎదిగారు.. ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్లపై చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్రెడ్డి పార్టీ మారారని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి ఏ పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై రాష్ట్ర ప్రభుత్వం 120కి పైగా కేసులు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజగోపాల్ ఏనాడైనా విమర్శించారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్పై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బలంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో వెంకట్రెడ్డి పాల్గొంటారని, వెంకట్రెడ్డి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడలేదని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.