ఉద్యోగుల సమస్యలపై నిరసనలు
ABN , First Publish Date - 2021-12-08T04:37:08+05:30 IST
పీఆర్సీ, సీపీఎస్ రద్దుతోపాటు పలు న్యాయమైన డిమాండ్ల కోసం మండలంలోని ఉద్యోగులు వారి కార్యాలయాల్లో మంగళవారం నిరసనలు ప్రారంభించారు.
పొదలకూరు, డిసెంబరు 7 : పీఆర్సీ, సీపీఎస్ రద్దుతోపాటు పలు న్యాయమైన డిమాండ్ల కోసం మండలంలోని ఉద్యోగులు వారి కార్యాలయాల్లో మంగళవారం నిరసనలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు. అనంతరం తహసీల్దారు పద్మజాకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నేత పాడి నరసింహులుతో పాటు తహసీల్దారు, రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్తో పాటు అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇందుకూరుపేట : రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్, జేఏసీ అమరావతి పిలుపు మేరకు మంగళవారం ఇందుకూరుపేట మండల కార్యాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే తమ న్యాయమైన 71 డిమాండ్లపై ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ క్రమంలో యూనియన్ కార్యాచరణ పిలుపు మేరకు నిరసనను కొనసాగిస్తామని వారు తెలిపారు.