వలిసెకు పునరుజ్జీవం

ABN , First Publish Date - 2021-03-01T06:18:10+05:30 IST

మన్యం అందాలకు అదనపు వన్నెతెచ్చిన వలిసె పంట సాగుకు పునరుజ్జీవం కల్పించేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నడుం బిగించారు.

వలిసెకు పునరుజ్జీవం
పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న వివిధ వలిసె రకాలు


చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌కు 

డీబీటీ ప్రాజెక్టు మంజూరు 

రూ.65 లక్షలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

ప్రయోగాత్మకంగా 1,800 రకాలు సాగు

నాలుగేళ్లలో 100 మేలుజాతి రకాలు గుర్తింపు


చింతపల్లి, ఫిబ్రవరి 28: మన్యం అందాలకు అదనపు వన్నెతెచ్చిన వలిసె పంట సాగుకు పునరుజ్జీవం కల్పించేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నడుం బిగించారు. నాణ్యమైన వలిసె విత్తనాల అభివృద్ధికిగాను బయో టెక్నాలజీ విభాగం (డీబీపీ) ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిశోధన స్థానానికి మంజూరుచేసింది. దేశ వ్యాప్తంగా అందుబాటులో వున్న వివిధ రకాల వలిసె విత్తనాలను నాలుగేళ్లపాటు ప్రయోగాత్మంగా సాగు చేయడానికి రూ.65 లక్షలు మంజూరుచేసింది. దీంతో స్థానిక శాస్త్రవేత్తలు వలిసె సాగు ప్రారంభించారు. 


మన్యంలో తగ్గిపోతున్న వలిసె సాగు

ఏజెన్సీ వాతావరణం వలిసె సాగుకు అత్యంత అనుకూలం. గిరిజన రైతులు గతంలో సుమారు 20 వేల హెక్టార్లలో ఈ పంటను సాగుచేసేవారు. అయితే ఆకాశ పందిరి అనే కలుపు మొక్క కొరకరాని కొయ్యగా మారడంతో కాలక్రమేణా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఏజెన్సీలో కొంతకాలం నుంచి రెండు మూడు వేల హెక్టార్లకు మించి వలిసె సాగు చేయడం లేదు. ప్రస్తుతం రైతులకు దేశవాలీ రకాలతోపాటు కేజీఎన్‌-2 రకం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

విత్తన అభివృద్ధికి నాలుగేళ్లపాటు అధ్యయనం

స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు...డీబీపీ ఎంపిక చేసిన 1,800 రకాల వలిసె విత్తనాల్లో మేలి వంగడాల ఎంపికకు నాలుగేళ్లపాటు అధ్యయన సాగు చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం అన్నిరకాల విత్తనాలు వేశారు. ఒక రకానికి మరో రకం క్రాస్‌ కాకుండా నెట్‌లను ఉపయోగించారు. విత్తన నాణ్యత, తెగుళ్లను తట్టుకునే స్వభావం, చీడపీడల వ్యాప్తి, దిగుబడి, నూనెశాతం ఆధారంగా మేలుజాతి విత్తనాలను శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. 


100 రకాల మేలుజాతి విత్తనాల ఎంపికే లక్ష్యం

నాణ్యతా ప్రమాణాల ఆధా రంగా కనీసం 100 రకాల మేలుజాతి విత్తనాలను ఎంపిక చేయాలన్న లక్ష్యంగా పరిశోధనలు చేపట్టాం. సూక్ష్మ అధ్యయనం కోసం ఇతర శాస్త్రవేత్తలతోపాటు విత్తన అభివృద్ధి శాస్త్రవేత్త, ప్రాజెక్టు ట్రైనీలు, 15 మంది కూలీలను నియమించాం. మన్యం రైతులకు నాలుగేళ్లలో ఉత్తమ రకాలైన వలిసె విత్తనాలను అందుబాటులోకి తీసుకువస్తాం.

- డాక్టర్‌ గుత్తా రామారావు, ఏడీఆర్‌, చింతపల్లి

Updated Date - 2021-03-01T06:18:10+05:30 IST