మూడు నెలలుగా రైతుల హరిగోస: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-24T23:06:40+05:30 IST

గత మూడు నెలలుగా ధాన్యం కోసం రైతులు హరిగోస పడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

మూడు నెలలుగా రైతుల హరిగోస: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: గత మూడు నెలలుగా ధాన్యం కోసం రైతులు హరిగోస పడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్లాల్లో కుప్పలు, ఇంటి ముందు శవాలుగా రైతుల పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు కలవలేదు, రైతు సమస్య వివరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని దెప్పిపొడిశారు. వరంగల్ గోడౌన్‌లోని 25వేల మెట్రిక్ టన్నుల బొయ్యం గోల్ మాల్‌పై కేంద్రం నిలదీస్తే దొంగళ్లలాగా పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.


సెంట్రల్ హాల్‌లో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారన్నారు.చావుడప్పులో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. మంత్రుల బృందం ఏం తేల్చిందని నిలదీశారు. ఖరీఫ్ పంట టార్గెట్ పూర్తిగా ఎందుకు సరఫరా చేయలేదో రైతులకు, కేంద్రానికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 


యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదన్నారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్‌రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందంలో సంతోష్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు.ఖరీఫ్‌లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్నారు. ఏదీ తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు.


ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.రైతులు ఎవరూ తొందరపడి చనిపోవద్దు, కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 27మధ్యాహ్నం 2గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తామనిరైతులంతా ఎర్రవెల్లికి తరలి రావాలని  పిలుపునిచ్చారు. టీపీసీసీ ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-24T23:06:40+05:30 IST