grama, ward sachivalayam ఉద్యోగులకు Jagan సర్కార్ ఊహించని షాక్..
ABN , First Publish Date - 2021-08-21T06:22:03+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది... పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు. అందుకునేది రూ.15 వేల స్టైఫండ్....
- రైస్ కార్డు కట్!
- తక్షణమే కార్డులు వెనక్కిచ్చేయాలని ఆదేశం
- ప్రభుత్వ ఉద్యోగులవడమే కారణం
- మొత్తం 12 వేల మంది ఉద్యోగులు
- వీరిలో 8 వేల మంది సచివాలయ ఉద్యోగులే
- అందరిపైనా క్రిమినల్ చర్యలు!
- ప్రభుత్వ ప్రయోజనాలు లేవు.. ఇచ్చేది స్టైఫండ్
- సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది... పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు. అందుకునేది రూ.15 వేల స్టైఫండ్. ప్రభుత్వ శాఖల్లోని ఇతర ఉద్యోగుల్లా ఎటువంటి ప్రయోజనాలకూ అర్హులుకారు. కానీ కేవలం ప్రభుత్వ ఉద్యోగులైనందునే వారి రైస్ కార్డులను వెనక్కిచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాదు. అలా కార్డులు కలిగి ఉన్న వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైస్ కార్డులు కలిగిన ప్రభుత్వోద్యోగులు తక్షణమే వాటిని సరెండర్ చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది. జిల్లాలో మొత్తం 12 వేల మంది కార్డులు సరెండర్ చేయాలని ఆదేశించగా, వారిలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ప్రభుత్వోద్యోగుల రేషన్ కార్డుల రద్దుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు, సివిల్ సప్లయిస్ అధికారుల మెడ మీద కత్తి పెట్టడంతో ఆగమేఘాల మీద రైస్ కార్డుల ర ద్దుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగులు రైస్ కార్డులను వెనక్కిచ్చేయటం చట్టబద్ధమే అయినప్పటికీ, వీరిలో అల్పాదాయ వర్గాల వారికి గత ప్రభుత్వం న్యాయం చేసింది. అప్పట్లో ఆర్టీసీ, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో తక్కువ వేతనాలు పొందే వారికి మినహాయింపునిచ్చింది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా అందరి కార్డులనూ ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 12 వేల మంది ప్రభుత్వోద్యోగులు రైస్ కార్డులను కలిగి ఉన్నారని అధికార యంత్రాంగం గుర్తించింది. ఒక్క విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 4,470 రైస్ కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని లెక్క తేల్చారు. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2,029, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో 2,767, నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో 2,734 రైస్ కార్డులు ఉన్నాయని గుర్తించారు. ఇలా గుర్తించిన వాటిలో ఎనిమిది వేల కార్డులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులవే.
ఆరోగ్య కార్డులకూ దూరమే
ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల రైస్ కార్డులు రద్దైతే.. వారి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పోతాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి ఎలాంటి హెల్త్ కార్డులు లేకపోవటం వల్ల వైద్య సేవలకు దూరమవుతారు. కుటుంబ సభ్యులంతా నిత్యావసరాలను కోల్పోతారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే రూ.15 వేల స్టైఫండ్లో సగం ప్రయాణ ఖర్చులకు, ఇంటి అద్దెల ఖర్చుకే పోతాయి. మిగిలిన సగం వేతనంతోనే జీవనం సాగించాల్సి ఉంటుంది. ఒక రకంగా సచివాలయ ఉద్యోగులకు ఇది దుర్భర పరిస్థితే. గతంలో అల్పాదాయ ఉద్యోగులకు రేషన్ కార్డులను ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాంతో ఆర్టీసీ చిరుద్యోగులు, మునిసిపల్ పారిశుధ్య కార్మికులు రేషన్ కార్డులను పొందగలిగారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో అల్పాదాయ వర్గాలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు సైతం రైస్ కార్డులను కోల్పోతున్నారు.
వీళ్ల ఆదాయమెంత?
జిల్లాలో 845 గ్రామ సచివాలయాలు, 440 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎనిమిది వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సచివాలయాల ఉద్యోగులు కాక ముందు నుంచే కార్డులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నా, వీరికి ఎలాంటి సర్వీసు రూల్స్ లేవు. ప్రొబేషనరీలోనే ఉన్నారు. స్టైఫండ్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒక రకంగా వీరంతా ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి స్టైఫండ్గా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ఏ ఒక్క ప్రయోజనమూ వీరికి అందదు. ప్రభుత్వం వీటన్నింటినీ విస్మరించటమే విడ్డూరంగా ఉంది.
క్రిమినల్ చర్యలకు ఆదేశాలు
ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రైస్ కార్డుల నిబంధనల ప్రకారం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే రైస్ కార్డుకు అనర్హులవుతారు. ఈ లెక్కన సచివాలయ ఉద్యోగులకు రూ.15 వేలు వేతనం వస్తుందన్న కారణంతో నిబంధనల ప్రకారం రైస్ కార్డుకు అర్హత లేదన్నది ప్రభుత్వ వాదన. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా రైస్ కార్డులను కలిగి ఉన్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించటమే వారిని ఆందోళనకు గురి చేస్తోంది.