కోతలు షురూ!
ABN , First Publish Date - 2020-10-30T10:32:36+05:30 IST
జిల్లాలో వానాకాలం సీజన్లో వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల కింద సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి.
కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్న వరి కోతలు
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
జిల్లాలో మొత్తం 337 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇప్పటికే 129 కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మరో వారం రోజుల్లో కేంద్రాలకు పెద్ద మొత్తం చేరుకోనున్న ధాన్యం
జిల్లాలో 4.95లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
ఇప్పటికే 2వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు
కామారెడ్డి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సీజన్లో వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల కింద సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేందుకు రైతులు బిజీ అయ్యారు. ఇప్పటికే కొందరు రైతులు వరి కోతలను ప్రారంభించారు. కోత మిషన్లు సైతం గ్రామాల్లోని పంట పొలాలకు చేరుకున్నాయి. వరి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో 4.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కోతలు మొదలైనందున ఇప్పటికే జిల్లాలో 129 కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఇప్పుడిప్పుడే వరి కోతలను మొదలు పెట్టడంతో వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలకు పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని సంబ ంధిత శాఖ అధికారులు భావిస్తున్నారు. అప్పటిలోగా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు జిల్లా స్థాయి అధికారు లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కొనుగోళ్ల లక్ష్యం 4.95 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 2 లక్షలకు ఎకరాలకు పైగానే రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్, కాలువ దిగువన నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, నస్రూల్లాబాద్, పోచా రం ప్రాజెక్ట్ కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు కామారెడ్డి, దోమకొండ, లింగంపేట తదితర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు కావడం ఇదే మొదటిసారి. ఈ లెక్కన 5.95లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారు లు అంచనా వేశారు. ఇందులో 4.95లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సన్నరకం ధాన్యం మూడు లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు రానుందని అంచనా వేశారు.
337 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో ఈ వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 337 కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఏర్పడ్డ ఇబ్బందుల సమస్యలు అనుభావాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందించారు. గతంతో పోలిస్తే ఈ సీజన్లో అదనంగా వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనగా మొత్తం 337 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకై కలెక్టర్ శరత్ నిర్ణయించారు. 309 పీఏసీఎస్లు, 20 ఐకేపీ, 8 మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు 1 కోటి 23 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 62లక్షల 52వేల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీక్లీనర్, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్ కాంటలు, గన్నీ సంచులు సిద్ధం చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయను న్నారు. జిల్లాలో గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఏడాది నుంచి ధాన్యాన్ని తరలిం చేందుకు క్లస్టర్లుగా విభజించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో 5 క్లస్టర్లను ఏర్పాటు చేయగా ఈ వానాకాలం సీజన్లో మాత్రం 7 క్లస్టర్లుగా విభజించి ట్రాన్స్పోర్ట్ ద్వారా మిల్లులకు ధాన్యాన్ని తరలించనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో 151 రైస్మిల్లు లకు కేటాయించారు. ఇందులో 116 రా మిల్లులు ఉండగా 35 బాయిల్ రైస్మిల్లులు ఉన్నాయి.
మద్దతు ధరకే కొనుగోలు
ఈ సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాళ్లకురూ.1,888, ‘బీ’ గ్రేడ్ క్వింటాలుకు రూ.1,868 చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 17 శాతం తేమ ఉన్న వడ్లనే కొనుగోలు చేయనున్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకే వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయ నుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 129 కేంద్రాల్లోని 2వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మేనేజర్ జితేందర్ తెలిపారు.