ఐరాస సదస్సుకు తెలంగాణా డ్రైలాండ్ ఫుడ్ సిస్టమ్స్పై అధ్యయన పత్రం
ABN , First Publish Date - 2021-07-29T21:06:59+05:30 IST
మెట్టు భూముల్లో వ్యవసాయం చేసే రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళతో
హైదరాబాద్ : మెట్టు భూముల్లో వ్యవసాయం చేసే రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళతో ఓ అధ్యయన పత్రాన్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్ఐసీహెచ్) రూపొందించింది. ఆర్ఐసీహెచ్ తెలిపిన వివరాల ప్రకారం, ‘‘డ్రైలాండ్ ఫుడ్ సిస్టమ్స్ ఇన్ తెలంగాణా’’ పేరుతో ఈ నివేదికను రూపొందించింది. ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్) భాగస్వామ్యంతో దీనిని తయారు చేసింది. సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్య సమితి ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్, 2021కి ముందు రోమ్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగిన ప్రీ సమ్మిట్కు ఈ నివేదికను సమర్పించింది.
2030నాటికి సాధించవలసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ‘‘చర్యల దశాబ్దం’’లో భాగంగా ఈ సదస్సును ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. 17 లక్ష్యాల సాధనకు కొత్త చర్యలను ఈ సదస్సు ఆవిష్కరిస్తుంది. ఆరోగ్యకరమైన, మరింత సుస్థిరమైన, సమాన ఫుడ్ సిస్టమ్స్ ఆధారంగా ఈ చర్యలను ప్రకటిస్తుంది.
రోమ్లో జరిగిన ప్రీ సమ్మిట్ ఈవెంట్లో యువత, రైతులు, స్థానికులు, పౌర సమాజం, పరిశోధకులు, ప్రైవేటు రంగం, విధాన నిర్ణేతలు, వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, పౌష్టికాహారం శాఖల మంత్రులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో విత్తన బ్యాంకుల ఏర్పాటు జరగాలని, ఆధునిక టెక్నాలజీని అమల్లోకి తేవాలని సలహాలు వచ్చాయని ఆర్ఐసీహెచ్ తెలిపింది.