పెళ్లి తర్వాత అత్తారింటికి బయల్దేరిన నవ వధువు.. ఊరేగింపులోనే దారుణం.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2021-12-02T18:35:17+05:30 IST
ఆమెకు ఆ రోజే వివాహం జరిగింది.. పెళ్లి వేదిక నుంచి అత్తారింటికి ఊరేగింపుగా బయల్దేరింది..
ఆమెకు ఆ రోజే వివాహం జరిగింది.. పెళ్లి వేదిక నుంచి అత్తారింటికి ఊరేగింపుగా బయల్దేరింది.. అత్తారింటికి మరొక కిలోమీటర్ దూరం ఉందనగా దారుణం జరిగింది.. కొందరు దుండగులు వధువుపై తుపాకీతో కాల్పులు జరిపారు.. ఆమె ఒంటి మీద నగలను దోచుకున్నారు.. శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆ యువతి ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది.. హర్యానాలోని రోహ్తక్లో ఈ ఘటన జరిగింది.
రోహ్తక్కు సమీపంలో బహు అక్బర్పూర్ గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి, సంప్లా ప్రాంతానికి చెందిన తనిష్కను బుధవారం వివాహం చేసుకున్నాడు. అనంతరం వధూవరులిద్దరూ కారులో ఊరేగింపుగా అక్బర్పూర్లోని ఇంటికి బయల్దేరారు. రాత్రి 11.30 సమయంలో ముగ్గురు దుండగులు ఇన్నోవాలో వచ్చి వధూవరులు ఉన్న కారు మీద దాడి చేశారు. వధువుపై కాల్పులు జరిపి ఆమె ఒంటి మీద నగలు తీసుకుపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి ఆమె శరీరం నుంచి ఐదు బుల్లెట్లు బయటకు తీశారు.
కాగా, ఆ దుండగులు అంతకు ముందే మరో గ్రామంలో కూడా దాడికి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బు, బంగారం దోచుకుని అతని ఇన్నోవా కారు వేసుకుని వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఈ పెళ్లి ఊరేగింపుపై కూడా దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి గురించి తీవ్రంగా గాలిస్తున్నారు.