బ్రిటన్‌ ప్రధాని పీఠం రేసులో దూసుకెళ్తున్న రిషీ

ABN , First Publish Date - 2022-07-21T07:24:46+05:30 IST

ఇంగ్లండ్‌ మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి పీఠానికి మరింత చేరువయ్యారు.

బ్రిటన్‌ ప్రధాని పీఠం రేసులో దూసుకెళ్తున్న రిషీ

ఐదో రౌండ్‌లో 137 ఓట్లతో విజయం

తుది రౌండ్‌లో లిజ్‌ ట్రస్‌తో అమీతుమీ

ఒకరిని ఎన్నుకోనున్న కన్జర్వేటివ్‌ సభ్యులు

సునాక్‌కే మొగ్గు అంటున్న విశ్లేషకులు!


లండన్‌, జూలై 20 : ఇంగ్లండ్‌ మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి పీఠానికి మరింత చేరువయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత, బ్రిటన్‌ నూతన ప్రధాని స్థానం కోసం జరుగుతున్న పోటీలో ఐదో రౌండ్‌ ఎన్నికలోనూ గెలిచి తుదిపోరుకు చేరారు. ఐదో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. టోరీ పార్టీ లీడర్‌షిప్‌ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన చివరి, ఐదో రౌండ్‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో రిషీ సునాక్‌ 137 ఓట్లతో అగ్రస్థానం సాధించగా, 113 ఓట్లతో ట్రస్‌ రెండో స్థానంలో నిలిచారు.


 ఇక, 105 ఓట్లు పొందిన వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డౌంట్‌ మూడో స్థానంలో నిలిచి పోటీ నుంచి తప్పుకున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌ పోలింగ్‌లో 118 మంది ఎంపీల మద్దతు సాధించిన రిషీ బుధవారం మరో 19 ఓట్లు అదనంగా పొందడం విశేషం. తుది పోటీకి చేరిన రిషీ, ట్రజ్‌లో ఒకరిని 1,80,000 మందికి పైగా ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా తమ నేతగా ఎన్నుకుంటారు. వీరంతా ఆన్‌లైన్‌ లేదా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పార్టీ సభ్యుల మద్దతు కోసం రిషీ, ట్రజ్‌ రాబోయే కొన్ని వారాల పాటు విస్త్రత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం జరిగే టీవీ డిబేట్‌లో వీరిద్దరూ ముఖాముఖి తలపడనున్నారు. సెప్టెంబర్‌ 5న బ్రిటన్‌ కొత్త ప్రధాని మంత్రి పేరును ప్రకటిస్తారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన ప్రతీ రౌండ్‌లో ఆధిక్యం సాధించిన రిషీ సునాక్‌ తుది పోరులోనూ గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-07-21T07:24:46+05:30 IST