UK PM Race: ముందంజలో Rishi Sunak.. రెండో రౌండ్‌లోనూ ఆధిక్యం

ABN , First Publish Date - 2022-07-15T13:26:18+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని పీఠానికి జరుగుతున్న రేసులో భారత సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, ఇంగ్లండ్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ ముందంజలో దూసుకుపోతున్నారు.

UK PM Race: ముందంజలో Rishi Sunak.. రెండో రౌండ్‌లోనూ ఆధిక్యం

బ్రిటన్‌ ప్రధాని పీఠం రేసులో దూసుకుపోతున్న రిషి

లండన్‌, జూలై 14: బ్రిటన్‌ ప్రధాని పీఠానికి జరుగుతున్న రేసులో భారత సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, ఇంగ్లండ్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవి నుంచి వైదొలిగాక.. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ తదుపరి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ(సంప్రదాయ ‘టోరీ పార్టీ లీడర్‌షిప్‌’ ఓటింగ్‌)ను ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన తొలి రౌండ్‌ ఎంపికలో.. కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలనేది నిబంధన. సునాక్‌ ఆ విజయాన్ని సునాయాసంగా సాధించారు. తొలిరౌండ్‌ తర్వాత 11 మంది పోటీలో ఉండగా.. గురువారం నిర్వహించిన రెండోరౌండ్‌ ఓటింగ్‌లో.. రిషి సునాక్‌ మిగతా పోటీదారుల కంటే ఎక్కువగా.. 101 ఓట్లు సాధించారు.


రెండోరౌండ్‌ ముగిశాక.. ప్రధాని పీఠానికి పోటీపడుతున్న వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. రిషి సునాక్‌తో పాటు.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డౌంట్‌(83 ఓట్లు), విదేశాంగ మంత్రి లీజ్‌ ట్రస్‌(64 ఓట్లు), మాజీ మంత్రి కెమి బడెనోష్‌(49 ఓట్లు), టోరీ సభ్యుడు టామ్‌ టుగెంధట్‌(32 ఓట్లు) ప్రధాని పదవి రేసులో ఉన్నారు. ఇలా పలు రౌండ్ల ఓటింగ్‌ తర్వాత.. సెప్టెంబరు 5న బ్రిటన్‌ తదుపరి ప్రధాని పేరును ప్రకటిస్తారు. ప్రస్తుత ఆర్థిక తిరోగమన పరిస్థితుల్లో బ్రిటన్‌ను పరిపాలించగల సంపన్నుడు అంటూ తనపై విపరీతంగా జరుగుతున్న ప్రచారాన్ని రిషీ సునాక్‌ తోసిపుచ్చారు. కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొన్న అనుభవం తనకు ఉందని తెలిపారు.

Updated Date - 2022-07-15T13:26:18+05:30 IST