ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం

ABN , First Publish Date - 2021-06-16T07:04:49+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) పుంజుకోవడంతో ఆదాయం కూడా పెరుగుతోంది. ఓఆర్‌ను పరిగణనలోకి తీసుకుని బస్సుల సంఖ్య పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం
తిరుపతి బస్టాండులో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

 నేటినుంచి కర్నూలుకు అదనపు బస్సు 

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 15: ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) పుంజుకోవడంతో ఆదాయం కూడా పెరుగుతోంది. ఓఆర్‌ను పరిగణనలోకి తీసుకుని బస్సుల సంఖ్య పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా కర్ఫ్యూ అమలుతో గత నెల ఐదో తేదీ నుంచి బస్సులు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే నడిచాయి. ఆ మేరకు బస్సులను ఏర్పాటుచేసి ట్రిప్పులను, కిలోమీటర్లను కుదించారు. దీనివల్ల ఆదాయం అమాంతంగా పడిపోయింది. మే ఏడు నుంచి జూన్‌ పదో తేదీవరకు రోజుకు సరాసరి రూ.15లక్షల మాత్రమే ఆదాయం వచ్చింది. మే 18న అత్యల్పంగా రూ.11.9లక్షలు మాత్రమే సమకూరింది. కర్ఫ్యూ సమయం మధ్యాహ్నం రెండు గంటల వరకు సడలింపు ఇచ్చాక బస్సుల సంఖ్య, కిలోమీటర్లను పెంచడంతో జూన్‌ 12న అత్యధికంగా రూ.23.53లక్షల ఆదాయం లభించింది. ఆరోజున 363బస్సులతో 499ట్రిప్పులు, 90వేల కిలోమీటర్లు తిరగడంతో ఓఆర్‌ 50శాతంగా నమోదైంది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి నుంచి చిత్తూరు, మదనపల్లె రూట్లలో ప్రతి 20 నిమిషాలకో బస్సు, పీలేరు, పుంగనూరు, నెల్లూరువైపుగా ప్రతి అరగంటకో బస్సును ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలుకు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతమున్న మూడు బస్సులు(ఉదయం 4.30, 6, 7గంటలకు)లతోపాటు 6.30గంటకు మరో సూపర్‌లగ్జరీ సర్వీసును ఏర్పాటుచేశారు. ఈ బస్సు బుధవారం ఉదయం నుంచి అందుబాటులో ఉంటుంది.


Updated Date - 2021-06-16T07:04:49+05:30 IST