రైతు బతికేదెలా?

ABN , First Publish Date - 2022-05-22T06:11:12+05:30 IST

రైతు బతికేదెలా?

రైతు బతికేదెలా?
ఎమ్మెల్యే సారథి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు వీరకుమారి

  గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సారథి ఎదుట మహిళా రైతు ఆవేదన

ముదునూరు(ఉయ్యూరు), మే 21 : పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోతే రైతులు ఎలా బతికేదని మహిళా రైతు ఎమ్మెల్యే సారథి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ముదునూరులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వ హంచారు. ఈ సందర్భంగా సారథి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకు న్నారు. గ్రామానికి చెందిన మహిళా రైతు  గొట్టుముక్కల వీరకుమారి మినుము ధరపై ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా మినుములు రూ. 6,300  కూడా కొనే వారు లేరని కనీసం రూ. 8వేలకుపైగా ఉంటే  కొంత వరకైనా రైతులకు మేలు కలుగుతుందని మొరపె ట్టుకున్నారు. మొదటి పంట వరిలో కౌలు, ఖర్చుల వరకైనా వచ్చినా రెండవ పంట అపరాల్లోనైనా  ఎంతో  కొంత మిగులుతాయన్న ఆశతో పెట్టుబడి పెట్టి, శ్రమించి పండించిన పంటకు ధర లేక పోతే రైతు బతికేదేలా అని ప్రశ్నించారు. ఈ ఏడాది పంట దిగుబడి కూడా తగ్గింది ఈ పరిస్థితుల్లో రైతుల మనుగడ ప్రశ్నార్ధకమైందని వాపోయారు. పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని సారథి సర్ది చెప్పారు. ఈ క్రాప్‌ నమోదు చేసినా ధాన్యం అమ్మేప్పుడు నమోదు కాలేదని రావడంతో చేసేది లేక దళారుల ద్వారా ధాన్యం తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చిందని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సివిల్‌ సప్లయిస్‌ అధికారులతో ఫోన్‌ద్వారా మాట్లాడి అలా ఎందుకు జరిగిందని ఆరాతీసి ఇకపై ఆవిధంగా జరగకుండా చూడాలని ఆదేశించారు. 

గ్రామంలో కొన్నిచోట్ల అంతర్గత రోడ్లు లేవని, పక్కా గృహాలు నిర్మించు కునేందుకు లోను మంజూరు చేయించాలని సొంత స్థలం ఉన్నవారు కోరారు. లోను మంజూరయ్యేలా చేస్తాను వెంటనే నిర్మాణం చేపట్టాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీలి కల్పన,  సర్పంచ్‌ ఎం.వెంకటనాగలక్ష్మి, ఎంపీడీవో సునీతాశర్మ, వైసీపీ నాయకులు దాసే రవి, గారపాటి నాని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:11:12+05:30 IST