శరన్నవరాత్రుల వేళ రామకృష్ణ మఠం వాలంటీర్ల ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-14T03:17:31+05:30 IST
హైదరాబాద్: నవరాత్రుల వేళ హైదరాబాద్ రామకృష్ణ మఠం వాలంటీర్లు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు.
హైదరాబాద్: నవరాత్రుల వేళ హైదరాబాద్ రామకృష్ణ మఠం వాలంటీర్లు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. హిమాయత్ నగర్లో పనిచేసే సుమారు 28 మంది మహిళా సిబ్బందికి చీరలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తోన్న వారిని గౌరవించుకోవడం పౌరుల బాధ్యతని రామకృష్ణ మఠం వాలంటీర్ మాధవి తెలిపారు. గురువైన రామకృష్ణ పరమహంస పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలోనూ శివుడిని దర్శిస్తూ సేవ చేయాలని రామకృష్ణ మఠంలో నేర్పారని ఆమె చెప్పారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నారాయణ సేవ పేరుతో నిత్యాన్నదానం, వైద్యసేవలతో పాటు ఇతర సేవల్లోనూ క్రమం తప్పక పాల్గొంటున్నామన్నారు. చిన్నారుల కోసం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ పేరుతో నిర్వహించే బాల్ వికాస్లో సేవలందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం వాలంటీర్లు దీక్ష, పరివీత, అశ్విని, ప్రపూర్ణ, కళ్యాణి, హేమామృత, భరణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.