బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ..
ABN , First Publish Date - 2022-06-25T05:37:24+05:30 IST
బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
అదుపు తప్పి కల్వర్టులో పడిన ద్విచక్రవాహనం
నడికూడ, జూన్ 24: బంధువుల ఇంట్లో జరిగిన పండుగకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టులో పడిపోగా ఇద్దరు అక్కకడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం నడికూడ మండలం కంఠాత్మకూర్ మాటు వాగు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన రెడ్డి నాగిరెడ్డి (33), శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన రజినీకర్ రెడ్డి (30)లు అన్నదమ్ములవుతారు. నాగిరెడ్డి చిన్నమ్మ కొడుకు రజనీకర్రెడ్డి వీరిద్దరు కలిసి రజనీకర్రెడ్డికి చెందిన పల్సర్ బైకుపై శుక్రవారం హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలోని బంధువుల ఇంటికి ఉదయం 9గంటలకు వెళ్లారు. తిరిగి ఇంటికి మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో వస్తుండగా కంఠాత్మకూర్ మాటువాగు సమీపంలో మూలమలుపు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి కల్వర్టులో పడిపోయింది. దీంతో ఇద్దరి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పరకాల ఏసీపీ శివరామయ్య, సీఐ శ్రీనివాస్, దామెర ఎస్సై హరిప్రియ చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
విషాదం
కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన రెడ్డి రాజిరెడ్డి-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు నాగిరెడ్డి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగిరెడ్డి తండ్రి రాజిరెడ్డి యేడాది కిందట అర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రాజిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం చేసి వారం అయినట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా, శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి - భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు చిట్టిరెడ్డి రజినికర్ రెడ్డి పరకాలలో ఇంటర్నెట్ సెంటర్ పని చేస్తున్నట్టు తెలిపారు. మృతులిద్దరూ అవివాహితులు కాగా, వారి గ్రామాల్లో విషాదం నెలకొంది.