మూడు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2022-05-26T14:02:27+05:30 IST

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. కడలూరు జిల్లా చిదంబరం-శీర్గాళి బైపాస్‌ రోడ్డు

మూడు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. కడలూరు జిల్లా చిదంబరం-శీర్గాళి బైపాస్‌ రోడ్డు సమీపంలో కూత్తన్‌కోయిల్‌ వద్ద కంకర లోడుతో రోడ్డుపక్కన ఆగివున్న లారీని సేలం నుంచి టైల్స్‌, గ్రానైట్‌ లోడుతో వెళుతున్న మినీ లారీ బుధవారం వేకువజామున ఢీకొంది. ఈ ఘటనలో మినీ లారీ ముందు భాగం నుజ్జునుజ్జుకాగా, డ్రైవర్‌ నకులేశ్వరన్‌ (25), లారీ క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న సేలం తమ్మంపట్టికి చెందిన సెల్వకుమార్‌ (38), కర్పగవల్లి (27), సెల్వకుమార్‌ మూడో కుమారుడు మిధున్‌ (3) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. లారీ వెనుక కూర్చున్న శివకుమార్‌, కరుప్పస్వామి, పెరుమాళ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అన్నామలైనగర్‌ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం చిదంబరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


నాగపట్టణంలో...

నాగపట్టణంలో జిల్లా అక్కరైపేట, కీసాంకుప్పం, చందమాన్‌పేట, నంబియార్‌ నగర్‌ జాలర్ల గ్రామాలకు చెందిన 8 మంది మహిళలు చేపలు కొనుగోలు చేసి టెంపోలో తిరువారూర్‌ వైపు వెళ్తుండగా, వాహనం వెనుక టైర్‌ పేలిపోవడంతో టెంపో బోల్తాపడింది. ప్రమాదంలో అక్కరైపేటకు చెందిన సర్గుణం అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చుట్టుపక్కల వారు అంబులెన్స్‌లో తిరువారూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కీళ్‌వేలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


మనప్పారై సమీపంలో...

దిండుగల్‌ జిల్లా అరవంకురిచ్చిలో అలెక్స్‌ పాండ్యన్‌-యోగనాయకి (31) దంపతులు నివశిస్తున్నారు. ఈ నెల 21వ తేది టీఎన్‌పీఎస్సీ పరీక్ష రాసేందుకు యోగనాయకి తిరుచ్చి జిల్లా కరుప్పూర్‌ గ్రామంలోని కన్నవారింటికి వెళ్లింది. మంజంపట్టి ఆంథొనీయార్‌ మహోన్నత పాఠశాలలో పరీక్ష రాసి యోగనాయకి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి, తిరుచ్చి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యోగనాయకి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది.



Updated Date - 2022-05-26T14:02:27+05:30 IST