కూతురు కోసం వెళుతూ కాటికి..
ABN , First Publish Date - 2021-07-24T07:24:41+05:30 IST
నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూటర్పై బయల్దేరిన తండ్రి ఒకరు, అదే వాహనంపై తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ప్రయాణమైన తండ్రి మరొకరు. వీరిద్దరిని మృత్యువు మింగేసింది. ఈ విషాదకర ఘటన నెల్లూరు - పొదలకూరు రహదారి మన్నవరప్పాడు క్రాసు రోడ్డు సమీపాన శుక్రవారం చోటుచేసుకుంది.
ఆమంచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
వేగంగా కారు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం
సౌత్మోపూరు, నావూరు వాసులుగా గుర్తింపు
నెల్లూరు రూరల్, జూలై 23 : నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూటర్పై బయల్దేరిన తండ్రి ఒకరు, అదే వాహనంపై తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ప్రయాణమైన తండ్రి మరొకరు. వీరిద్దరిని మృత్యువు మింగేసింది. ఈ విషాదకర ఘటన నెల్లూరు - పొదలకూరు రహదారి మన్నవరప్పాడు క్రాసు రోడ్డు సమీపాన శుక్రవారం చోటుచేసుకుంది.
నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూరు గ్రామానికి చెందిన చేబోలు చిన్న రమణయ్య (63), పొదలకూరు మండలం నావూరులో అదే గ్రామానికి చెందిన తలపనేని పెంచల కోటేశ్వరరావు (50)కు చెందిన పొలాన్ని కొనుగోలు చేశాడు. కోటేశ్వరరావు కుమార్తె నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఆమెను తీసుకువచ్చేందుకు కోటేశ్వరరావు తన ఇంటి నుంచి స్కూటర్ పై బయల్దేరాడు. చిన్న రమణయ్య కుమార్తె ఇందుకూరుపేట మండలం జేజే పేటలో ఉంటోంది. ఆమె ఇంటికి వెళ్లేందుకు రమణయ్య కూడా కోటేశ్వరరావుతో కలిసి బయలుదేరాడు. నెల్లూరుకు వస్తుండగా మన్నవరప్పాడు క్రాసు రోడ్డు సమీపాన నెల్లూరు నుంచి పొదలకూరు వైపు వెళ్తున్న కారు అతి వేగంగా రాంగ్ రూట్లో వచ్చి స్కూటర్ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమణయ్య, కోటేశ్వరరావు అక్కడి కక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న సుమారు ఐదు మంది గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని స్థానికులు 108 వాహనంలో నెల్లూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే కారులో ప్రయాణిస్తున్నది ఎవరన్నది సమాచారం అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐ నాగార్జున్రెడ్డి కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
కూతుళ్ల కన్నీరు..
తండ్రులు తమ వద్దకు వస్తూ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కోటేశ్వరరావు, చిన్న రమణయ్య కుమార్తెలు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నాన్నా... లే... అంటూ వారు చేసిన రోదన చూపరులను కంటతడిపెట్టించింది. వారి మరణంతో ఇటు సౌత్మోపూరు, అటు నావూరు, జేజేపేట గ్రామాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.