మూడు నెలలు.. పది ప్రాణాలు
ABN , First Publish Date - 2021-10-26T18:45:12+05:30 IST
మణుగూరులోని భద్రాద్రి పవర్ప్లాంట్ ప్రాతం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఈప్రాంతంలో ఏదోఒక సంఘటన జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రదాన కారణం
- ప్రమాదాలకు నిలయంగా బీటీపీఎస్ ప్రాంతం
- ఓవర్స్పీడ్, అధికలోడుతో లారీల భీతావహం
- గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు
మణుగూరు రూరల్(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరులోని భద్రాద్రి పవర్ప్లాంట్ ప్రాతం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఈప్రాంతంలో ఏదోఒక సంఘటన జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రదాన కారణం మణుగూరు నుంచి బీటీపీఎస్కు వచ్చే బొగ్గులారీలే.. అధికలోడ్తో పాటు ఓవర్ స్పీడ్తో వెళ్తుండటంతో ఇరుకు రహదారిలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం జరిగిన సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. లారీ వెనుక నుంచి ఢీకొనటంతో కరకగూడెం మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, అతని కుమారుడు, కుమార్తె మృతిచెందిన సంఘటన ప్రమాదాల తీవ్రతను చాటుతోంది. బీటీపీఎస్ ప్రాంతంలోమూడు నెలలోనే పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రాతంలో ప్రదాన రహదారిపై దుకాణాలు, చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకోవటంతో రహదారి ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. బీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావటంతో నిత్యం వందలాది బొగ్గులారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. అధికలోడు, ఓవర్స్పీడుతో పాటు డ్రైవర్లు మద్యం సేవించి లారీలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు చేపడతాం: బాలరాజు, బీటీపీఎస్ సీఈ
రోడ్డుప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. బీటీపీఎస్ ప్రాంతంలో ఆక్రమణకు గురయిన రహదారిపై దుకాణాలను తొలగిస్తాం. రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. వాహనాల డ్రైవర్లకు కూడా సూచించాం. రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం మా పరిధిలో లేదు.