రహదారిపైనే వర్షం నీరు
ABN , First Publish Date - 2022-08-09T06:42:10+05:30 IST
రహదారిపైనే వర్షం నీరు
నున్నలో ఇదీ పరిస్థితి .. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
విజయవాడ రూరల్, ఆగస్టు 8 : కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రోడ్డు మొత్తం వర్షపు నీరే కనిపిస్తుంది. నున్నలోని ప్రధాన విజయవాడ - నూజివీడు రోడ్డుకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామంలోని వాడుక నీరంతా రోడ్డుపైకి చేరుతుంది. నున్న శివారు పవర్గ్రిడ్ వద్ద అపార్ట్మెంట్లు భారీగా వెలిశాయి. ఆయా అపార్ట్మెంట్లలోని వాడుక నీరుతోపాటు వర్షపు నీరు తోడై విజయవాడ - నూజివీడు రోడ్డు పూర్తిగా ముంపునకు గురవుతోంది. ఒక్కసారి వర్షం వస్తే ఆ నీరు కనీసం వారం రోజులపాటు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు వర్షపు నీరు రోడ్డు మలుపు వద్ద స్తంభించడంతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్శాఖ అధికారులు స్పందించి నున్నలో డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.