విషాదం

ABN , First Publish Date - 2020-11-27T05:52:28+05:30 IST

జాతీయరహదారిపై స్థానిక జగద్గురు స్పిన్నింగ్‌ మిల్లు ఎదురు ఆగి ఉన్న లారీని గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో భార్య అక్కడికక్కడే చనిపోయింది.

విషాదం
లారీ కిందకు దూసుకుపోయిన కారు

మార్టూరులో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ప్రమాదస్థలిలో భార్య మృతి

భర్త పరిస్థితి విషమం

ద్దరిదీ విజయవాడ

ఇద్దరూ ఒంగోలులో బ్యాంక్‌ ఉద్యోగులే

మార్టూరు, నవంబరు 26 : జాతీయరహదారిపై స్థానిక జగద్గురు స్పిన్నింగ్‌ మిల్లు ఎదురు ఆగి ఉన్న లారీని గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో భార్య అక్కడికక్కడే చనిపోయింది. భర్త మేరెడ్డి వెంకటసాయికుమార్‌రెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో జరిగింది. ఏఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం... ఒంగోలులో నివాసం ఉంటున్న మేరెడ్డి వెంకటసాయికుమార్‌రెడ్డి, కిరణ్మయిలు భార్యాభర్తలు, అతను హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌లో, ఆమె సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ విజయవాడ నగరంలోని విద్యాధరపురానికి చెందిన వారు. వివాహమై 14 నెలలు అయ్యింది. బుధవారం ఉదయం విజయవాడలో ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో కారులో ఒంగోలు బయలుదేరారు. తాడేపల్లిగూడెం నుంచి బెంగళూరుకు పామాయిల్‌ లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై మార్టూరు సెంటరులో ఆగిఉంది. ఆ లారీని గమనించక వెనుక భాగాన్ని కారు బలంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న భర్త సాయికుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, భార్య కిరణ్మయి తలకు తీవ్రగాయమై సీటులోనే మృతి చెందింది. కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరుచుకొని పగిలిపోయాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది.సమాచారం అందుకున్న ఏఎస్సై వెంకటేశ్వర్ల్లు పోలీసు సిబ్బందితో వెళ్లి లారీ కిందకు ఇరుక్కుపోయిన కారును బయటకు తీయించారు. వెంకటసాయికుమార్‌రెడ్డిని బయటకుతీసి 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి దొడ్డి రమేష్‌ ఫిర్యాదు మేరకు గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కిరణ్మయి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.




Updated Date - 2020-11-27T05:52:28+05:30 IST