రోహిత్ ఈజ్ బ్యాక్.. విండీస్తో సిరీస్కు రెడీ!
ABN , First Publish Date - 2022-01-26T01:55:27+05:30 IST
గాయంతో బాధపడుతూ దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన ఇండియా వైట్బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో
న్యూఢిల్లీ: గాయంతో బాధపడుతూ దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన ఇండియా వైట్బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో సిరీస్కు రెడీ అయ్యాడు. భారత్-విండీస్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా, మూడు వన్డేలకు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఫిబ్రవరి 16-20 మధ్య జరగనున్న టీ20 సిరీస్కు కోల్కతా ఆతిథ్యమిస్తుంది.
విండీస్తో జరగనున్న వైట్బాల్ సిరీస్కు రోహిత్ అందుబాటులో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ ఇప్పటికే ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఫిట్నెస్ టెస్టు కోసం త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో రోహిత్కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, 2022, 2023లలో వరుస ప్రపంచకప్ల నేపథ్యంలో అతడిపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
రోహిత్ గైర్హాజరీలో వన్డే జట్టును నడిపించిన కేఎల్ రాహుల్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. కాబట్టి జట్టును నడిపించాలంటే రోహిత్ సారథ్యంలో మరికొంత కాలం ఆడకతప్పదు. టీ20 ప్రపంచకప్ మిస్సైన హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్లో బంతితోనూ కష్టపడుతున్నాడు.
ఒకవేళ విండీస్ జరగనున్న సిరీస్లో పాండ్యాకు చోటు దక్కకుంటే కనుక శ్రీలంక పర్యటనలో తప్పకుండా చోటు లభిస్తుందని చెబుతున్నారు. అలాగే, రవీంద్ర జడేజా కూడా పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రాకు మాత్రం విండీస్తో జరిగే సిరీస్లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.