‘రొమాంటిక్‌’ హంగామా

ABN , First Publish Date - 2021-10-23T05:51:41+05:30 IST

నగరంలోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ‘రొమాంటిక్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక శుక్రవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. శ్రేయాస్‌ మీడియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో సినిమాకు సంబంధించిన పలు ట్రైలర్‌లను విడుదల చేశారు.

‘రొమాంటిక్‌’ హంగామా

రంగలీల మైదానంలో ఘనంగా ప్రీ రిలీజ్‌ వేడుక
సందడి చేసిన తారాగణం..
ప్రత్యేక ఆకర్షణగా విజయ్‌ దేవరకొండ
దుమ్మురేపిన కళాకారుల నృత్యాలు
సక్సెస్‌ కావాలని ఆకాంక్షించిన మంత్రి ఎర్రబెల్లి


ఏకశిలనగర్‌ (వరంగల్‌), అక్టోబరు 22 :
నగరంలోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ‘రొమాంటిక్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక  శుక్రవారం  రాత్రి కన్నులపండువగా జరిగింది.  శ్రేయాస్‌ మీడియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో  సినిమాకు సంబంధించిన పలు ట్రైలర్‌లను విడుదల చేశారు. చిత్ర సమర్పకురాలు లావణ్య, నిర్మాతలు పూరి జగన్నాథ్‌, చార్మి, దర్శకుడు అనిల్‌ పడూరి, హీరో ఆకాశ్‌ పూరి, హీరోయిన్‌ కేతిక శర్మ, మ్యూజిక్‌ డైరెక్టర్‌లు భాస్కర్‌భట్ల, సునిల్‌ కశ్యప్‌ తదితరులు వేడుకలకు హాజరయ్యారు. యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్‌శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రత్యేక అతిథిగా నటుడు విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. వీరితోపాటు మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు. అంతకుముందు కళాకారులు నృత్యాలతో దుమ్మురేపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు  మాట్లాడుతూ  హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌లో సినిమాల ప్రీరిలీజ్‌లు, షూటింగ్‌లు చేపట్టాలని కోరారు.  వరంగల్‌ గడ్డకు ఒక చరిత్ర ఉందని,  ఇక్కడ షూటింగ్‌లు, ప్రీ రిలీజ్‌ వేడుకలు నిర్వహిస్తే ఆ సినిమాలు  తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు. ‘రొమాంటిక్‌’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.  ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ సుధారాణి మాట్లాడుతూ చిత్ర ట్రైలర్లు బాగున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది: విజయ్‌దేవరకొండ

ఈనెల 29న ఽథియేటర్‌లలో రిలీజ్‌ అవుతున్న  ఈ సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని సినీ నటుడు విజయ్‌దేవరకొండ అన్నారు. తొలి పరిచయంగా దర్శకుడు అనిల్‌ పడూరి ఈ సినిమాను అద్భుతంగా పండించాడన్నారు. ఆకాశ్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, ఆకాశ్‌ ఈ సినిమాతో హిట్‌ కొట్టి తన తండ్రి పూరిజగన్నాథ్‌ ఇండస్ట్రీలో కాలర్‌ ఎగిరేసేలా చేస్తాడన్నారు. చిత్ర నిర్మాత  చార్మి, కథ, స్ర్కీన్‌ప్లే డైలాగులు అందించిన పూరి జగన్నాథ్‌ ఖాతాలో మరో హిట్‌ పడుతుందన్నారు.

చిత్ర హీరో ఆకాశ్‌ పూరి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే తనకు ప్రాణమని సినిమా హిట్‌ అయినా ప్లాప్‌ అయినా సినిమాలు చేస్తానన్నారు. ప్రతీ షాట్‌ కష్టంతో కాకుండా ప్రాణంతో చేస్తున్నామని అన్నారు.  చిత్ర నిర్మాతలు, దర్శకుడు తదితర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ రొమాంటిక్‌ బాగా వచ్చిందని ఈనెల 29న థియేటర్‌లో రిలీజ్‌ అవుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ శ్రీనివాస్‌ తోపాటు చిత్ర యూనిట్‌ పాల్గొంది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన యువత.. వేడుక ఆద్యంతం కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేశారు.















Updated Date - 2021-10-23T05:51:41+05:30 IST