Qualifier 2: కీలక మ్యాచ్లో బ్యాట్లెత్తేసిన బెంగళూరు.. రాజస్థాన్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-28T02:55:53+05:30 IST
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్లో
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్లో తడబడింది. వేగంగా ఆడే క్రమంలో బెంగళూరు ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసిన డుప్లెసిస్ సేన ప్రత్యర్థి ఆర్ఆర్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగితే తప్ప ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం దాదాపు అసాధ్యం.
ఎలిమినేటర్ మ్యాచ్లో సెన్షేనల్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసిన రజత్ పటీదార్ మరోమారు ఆపద్బాంధవుడయ్యాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత కెప్టెన్ డుప్లెసిస్ చేసిన 25 పరుగులే రెండో అత్యధికం. గ్లెన్ మ్యాక్స్వెల్ 24 పరుగులు చేసి అవుట్ కాగా, ఆదుకుంటాడనుకున్న దినేశ్ కార్తీక్ కూడా ఉసూరుమనిపించాడు. ఆరు పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగులో పెవిలియన్ చేరాడు. మొత్తంగా 20 ఓవర్లు ఆడిన బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్ కాయ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.