నకిలీ బిల్లులతో రూ.11 లక్షల అవకతవకలు

ABN , First Publish Date - 2021-07-30T05:58:55+05:30 IST

మండలంలోని చెట్టుపల్లి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనలో వివిధ పనులు చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి రూ.11 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులు అవకతవకలకు పాల్పడ్డారని సర్పంచ్‌ గజాల నాగరత్నం, ఐదో వార్డు సభ్యుడు సూరిబాబు ఆరోపించారు.

నకిలీ బిల్లులతో రూ.11 లక్షల అవకతవకలు
ఆర్డీవో కార్యాలయ డీటీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేస్తున్న చెట్టుపల్లి సర్పంచ్‌ నాగరత్నం

  

  అధికారులకు చెట్టుపల్లి సర్పంచ్‌ నాగరత్నం ఫిర్యాదు 

 బాధ్యులపై చర్యలకు డిమాండ్‌

నర్సీపట్నం, జూలై 29 : మండలంలోని చెట్టుపల్లి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనలో వివిధ పనులు చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి రూ.11 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులు అవకతవకలకు పాల్పడ్డారని సర్పంచ్‌ గజాల నాగరత్నం, ఐదో వార్డు సభ్యుడు సూరిబాబు ఆరోపించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా పంచాయతీ ఎన్నికలకు ముందు రోజు సాధారణ సమావేశం నిర్వహించామని చూపి, వివిధ రకాల పనులకు నకిలీ బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పంచాయతీలో పలు అభివృద్ధి పనులకిచ్చిన సిమెంటు, ఇసుకను కాంట్రాక్టర్‌తో కలిసి దారిమళ్లించి, ఆరేడు నెలలుగా అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని వివరించారు. అధికారుల అవకతవకలను ప్రశ్నించినందుకు సర్పంచ్‌పై నెపం నెట్టేసి జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని తెలిపారు. చేయని పనులు ఎంబుక్‌ రికార్డులో నమోదు చేసి బిల్లులు పెట్టాలని వేధించారని, అలా చేయకుంటే చెక్‌ పవర్‌ రద్దు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చినట్టు చూపించి రూ.3 లక్షలకు పైగా కాజేశారని ఆరోపించారు. ఎలాంటి బదిలీలు చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నప్పటికీ, సర్పంచ్‌ను వేధించేందుకు పరిపాలనా సౌలభ్యం పేరుతో నెల రోజుల్లో నలుగురు కార్యదర్శులను మార్చారని ఆరోపించారు. ఇళ్ల పట్టాలు 80 శాతం మందికి పైగా అనర్హులకు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో అవతవకలపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - 2021-07-30T05:58:55+05:30 IST