రూ.2 కోట్ల్లు స్వాహా..!
ABN , First Publish Date - 2021-10-28T06:00:16+05:30 IST
: ప్రభుత్వ శాఖల్లో వంద రూపాయలు డ్రా చేయాలన్నా.. సవాలక్ష నిబంధనలు ఉంటాయి. అన్నీ కరెక్టుగా ఉంటేనేగానీ, డబ్బు అందదు. అలాంటిది రికార్డులు కూడా లేకుండా ఏకంగా రూ.2 కోట్లు స్వాహా చేశారంటే ఎంతటి ఘనులో అంచ నా వేయొచ్చు.
పంచాయతీరాజ్లో ఆలస్యంగా వెలుగులోకి..
రికార్డులు లేకుండా 2 చెక్కుల ద్వారా డ్రా..
ఓ ఇంజనీరు అవినీతి బాగోతం
లోగుట్టుగా విచారణ
గోప్యంగా ఉంచుతున్న వైనం
అనంతపురం విద్య, అక్టోబరు 27: ప్రభుత్వ శాఖల్లో వంద రూపాయలు డ్రా చేయాలన్నా.. సవాలక్ష నిబంధనలు ఉంటాయి. అన్నీ కరెక్టుగా ఉంటేనేగానీ, డబ్బు అందదు. అలాంటిది రికార్డులు కూడా లేకుండా ఏకంగా రూ.2 కోట్లు స్వాహా చేశారంటే ఎంతటి ఘనులో అంచ నా వేయొచ్చు. పంచాయతీరాజ్లో ఈ భారీ స్కాం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ ఇంజనీరు బరితెగించాడు. ఏకంగా రూ.2 కోట్ల నిధులను స్వాహా చేశాడు. దీనిపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఆ శాఖలోని ఇంటి దొంగలు.. ఇంజనీరుకు సహకరిస్తున్నట్లు సమాచారం. బుధవారం విచారణాధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో 2 నెలల వ్యవధిలోనే రెండు విడతలుగా 2 చెక్కులు డ్రా చేసినట్లు తెలుస్తోంది.
రికార్డులు లేకుండా డ్రా..
పంచాయతీరాజ్లోని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి రూ.12.10 లక్షల చెక్కులను ఒక సంస్థ పేరుతో డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు ఎంపీల్యాడ్స్ నుంచి డ్రా చేసినట్లు సమాచారం. ఈ చెక్కును 9వ నెలలో డ్రా చేసినట్లు తెలుస్తోంది. మరో రూ.1.89 కోట్లకు పైగా చెక్కును సైతం మరో వ్యక్తి పేరుతో అదే నెలలో డ్రా చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ చెక్కును ఓ కర్ణాటక బ్యాంకు ద్వారా డ్రా చేసినట్లు సమాచా రం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బాగోతంపై జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ (ఆర్థికశాఖ)కు ఫిర్యాదు వెళ్లడంతో అక్కడి నుంచి ఈ అవినీతి బాగోతం బయటపడినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పం చాయతీరాజ్ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ మేరకు బుధవారం నలుగురు అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వనీయవర్గాల స మాచారం. విచారణలో భాగంగా కొన్ని రికార్డులు సైతం స్వాధీనం చేసుకున్నట్లు పంచాయతీరాజ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తొక్కిపెట్టే యత్నం..
ఈఈ అవినీతి బాగోతాన్ని తొక్కి పెట్టేందుకు యత్నాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్శాఖ ఎస్ఈ కార్యాలయంలో తనకు అనుకూలంగా ఉండే వారితో విచారణను సైతం ప్రభావితం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విచారణ చేపట్టి, రికార్డులు స్వాధీనం చేసుకున్నా.. ఆ శాఖలో ఏం జరగలేదన్నట్లు కొందరు ఉద్యోగులు గోప్యత పాటించడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.