ఆర్ఎస్ఎస్ మతం ఆధారంగా వివక్ష చూపబోదని రతన్ టాటాకి చెప్పాను: నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2022-04-15T01:55:41+05:30 IST

పుణె : మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్ వివక్ష చూపబోదని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చెప్పానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు.

ఆర్ఎస్ఎస్ మతం ఆధారంగా  వివక్ష చూపబోదని రతన్ టాటాకి చెప్పాను: నితిన్ గడ్కరీ

పుణె : మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్ వివక్ష చూపబోదని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చెప్పానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు. పుణెలోని సిన్హాగడ్ ప్రాంతంలో చారిటబుల్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన - బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన నాటి రోజులను ఆయన ప్రస్తావించారు. ‘‘ ఆ రోజుల్లో ఔరంగాబాద్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కేబీ హెడ్గేవర్ పేరిట ఒక హాస్పిటల్ ప్రారంభమైంది. అప్పుడు నేను మంత్రిగా కొనసాగుతున్నాను. ఈ హాస్పిటల్‌ను రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని ఆర్‌ఎస్ఎస్‌కు చెందిన ఓ సీనియర్ భావించారు. ఇందుకు నా సహాయాన్ని కోరారు. నేను రతన్ టాటాను సంప్రదించి, హాస్పిటల్ ప్రారంభానికి ఒప్పించాను. అయితే రతన్ టాటా హాస్పిటల్‌కు చేరుకున్నాక ఈ హాస్పిటల్ కేవలం హిందువులకే సేవలు అందిస్తుందా అని అడిగారు. నేను వెంటనే స్పందించి.. అలా ఎందుకు అనుకుంటారు సార్ అని అన్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఆర్‌ఎస్ఎస్‌కు చెందినది కదా.. అన్నారు. అలాంటిదేమీ ఉండదు సార్. అన్ని వర్గాలకు సేవలు అందిస్తుందని రతన్ టాటాకు చెప్పాను. ఆర్‌ఎస్ఎస్‌కు అలాంటి వివక్ష ఉండబోదని చెప్పాను. ఆ తర్వాత రతన్ టాటా చాలా సంతోషించారు’’ అని మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2022-04-15T01:55:41+05:30 IST