లైసెన్స్ లేకుండా హోటల్ నిర్వహణ
ABN , First Publish Date - 2021-11-28T05:45:59+05:30 IST
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని కనకదుర్గ ఆహార క్యాంటీన్కు ఫుడ్ లైసెన్సు లేని విషయం బయటపడింది. జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులు శనివారం క్యాంటీన్లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
ట్యాంకులో నీరే వంటకు, తాగునీటికి..
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ క్యాంటీన్లో తనిఖీలు
సీజ్ చేయాలని ఆదేశాలు
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 26: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని కనకదుర్గ ఆహార క్యాంటీన్కు ఫుడ్ లైసెన్సు లేని విషయం బయటపడింది. జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులు శనివారం క్యాంటీన్లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఓవర్ హెడ్ ట్యాంకు నీటినే వంటలకు ఉపయోగించడం, ఆ నీటినే కస్టమర్లకు తాగునీరుగా అందివ్వడం, క్యాంటీన్ లోపల నాచుపట్టిన అపరిశుభ్ర వాతావరణం, వంటలకు ఇళ్లలో వాడే డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం వంటివి బయటపడ్డాయి. దీంతో క్యాంటీన్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు 24 గంటల్లో క్యాంటీన్ సీజ్ చేసి మూసివేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఫుడ్కంట్రోల్ అధికారులు సూచించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఆహార క్యాంటీన్ నిర్వహణపై జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం జిల్లా సహాయ నియంత్రణ అధికారి బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కల్యాణ్చక్రవర్తి రాజమహేంద్రవరం ఆర్టీసీ క్యాంటీన్లో తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ డీఎం బేగం, డిప్యూటీ సీటీఎం వరప్రసాద్లతో కలసి క్యాంటీన్ను పరిశీలించారు. వంట గదిని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. నిర్వాహకుడు గణేష్ నుంచి క్యాంటీన్కు సంబంధించిన రికార్డులు తీసుకుని పరిశీలించారు.